టీఆర్ఎస్ ప్రభుత్వంపై మళ్లీ మొదలైన మొట్టికాయలు..! ఇప్పుడు పంచాయతీ కార్యదర్శుల కేసు
Recommended Video
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వానికి కోర్టుల నుంచి మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. 2014 లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో చాలా కేసులు పడ్డాయి. మాగ్జిమమ్ కేసుల్లో ప్రభుత్వానికి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఇక రెండోసారి పగ్గాలు చేపట్టిన తరువాత కోర్టు మొట్టికాయలు మళ్లీ మొదలయ్యాయి.
ఇలా రెండోసారి అధికారంలోకి వచ్చిందో లేదో అలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి అక్షింతలు పడ్డాయి. పంచాయతీ జూనియర్ కార్యదర్శుల నియామకం వివాదస్పదం కావడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ప్రభుత్వం మెడకు "పంచాయతీ" కేసులు
పంచాయతీ రాజ్ శాఖ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి చుక్కెదురవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై పెద్ద దుమారమే రేగింది. బీసీ రిజర్వేషన్లు కులాలవారీగా తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విచారణ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది.
తాజాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఎంపికైన అభ్యర్థులకు న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దని సూచించింది. ఫైనల్ కీ ప్రకటించకపోవడం, ప్రైమరీ కీ పై 70వేల మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం, రిజర్వేషన్లు సరిగా అమలుచేయకపోవడం తదితర కారణాలతో బుధవారం కొందరు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు బ్రేక్ వేసింది న్యాయస్థానం.
పాత కేసుల చిట్టా పెద్దదే..!
టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో చాలాసార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. సమర్థవంతమైన పాలన అందించడంలో విఫలమవుతోందని ప్రజాస్వామ్యవాదులు పదేపదే న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రజాహిత వ్యాజ్యాల్లో రాజ్యాంగ ధర్మాససం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాలకుల్లో కొంతమేర చలనం వచ్చిందనే వాదనలున్నాయి. మరోవైపు కోర్టు నిర్ణయాలను ప్రభుత్వం ధిక్కరిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఉద్యోగ నియామకాలు, విద్య, క్రీడలు ఇలా చాలా శాఖలకు సంబంధించి ప్రభుత్వం హైకోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించడంపై కూడా హైకోర్టు అక్షింతలు వేసింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తివేసినందుకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు వారాల పాటు నిషేధం సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలా చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది.
కొందరికి లబ్ధి చేకూర్చడానికి రాజకీయ కొలువులు అంటగట్టడం, ముందస్తు ఎన్నికలకు వారం ముందు మజ్లిస్ పార్టీకి అతి చవకగా భూమిని కట్టబెట్టడం, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ విషయంలో 123 జీవో తెరపైకి తేవడం.. ఇలా చాలా అంశాల్లో ప్రభుత్వానికి చీవాట్లు పడ్డాయి. సిరిసిల్ల ప్రాంతంలోని నేరేళ్లలో ఇసుక తరలింపు వద్దన్నందుకు దళితుల్ని పోలీసులు పాశవికంగా హింసించిన ఘటన, ఖమ్మంలో మిర్చి పంటకు మద్ధతు ధర కల్పించాలని అడిగిన రైతులకు పోలీసులు బేడీలు వేయడం ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు మిగిల్చాయి.
ప్రభుత్వ వైఖరి.. కోర్టు అక్షింతలు
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి కారణంగా అడ్వకేట్ జనరల్ పదవికి సైతం ఇద్దరు రాజీనామా చేయడం గమనార్హం. మళ్లీ ఆ పదవిలో వేరేవారిని నియమించడంలో కూడా ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. కేసులు బాగా పడ్డాక గానీ ఆ పదవిని భర్తీచేయలేదనే అపవాదు మూటగట్టుకుంది. ఒకరకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ పాలన మొత్తం కోర్టుల చుట్టే తిరిగిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగిఉంటే.. ఈసారి సరిదిద్దుకుంటామని సీఎం కేసీఆర్ మొన్నటి ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక న్యాయస్థానం తాఖీదులు షురూ కావడం గమనార్హం. మొత్తానికి కోర్టు కేసులపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.