రుణమాఫీ నిధులు విడుదల: మూడో విడుత క్లియర్ చేసిన టీఆర్ఎస్ సర్కార్
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు అధికారంలోకి వచ్చాక.. రుణమాఫీ ఫైల్ పై సంతకం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. మొత్తంగా నాలుగు విడుతల్లో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా దీనికి సంబంధించి మూడో విడుత చెల్లింపులను పూర్తి చేసింది ప్రభుత్వం. మూడో విడుతలో మొదటి దఫా కింద రూ.2019.99 కోట్లను గత జులై నెలలో విడుదల చేసిన ప్రభుత్వం.. నేడు రెండో దఫా చెల్లింపుల కింద రూ.2019.19కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మొత్తం రూ.17వేల కోట్ల చెల్లింపుల్లో మూడు విడుతలను పూర్తి చేసేసింది ప్రభుత్వం.
ఏటా రూ.4250కోట్ల చెల్లింపులతో నాలుగేళ్ల కాలంలో మొత్తం రూ.17వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం హామి ఇచ్చింది. ఇందులో భాగంగా.. 2014 సెప్టెంబర్లో తొలి విడుత కింద ఏకమొత్తంగా రూ.4250 కోట్లను విడుదల చేసింది. రెండో విడుతలో రూ.4250కోట్లను రెండు దఫాలుగా చెల్లించింది. ఇక మూడో విడుతలో మొదటి దఫా కింద రూ.2100కోట్లను గతేడాది సెప్టెంబర్ లో చెల్లించిన ప్రభుత్వం.. రెండో దఫాలో మిగిలిన రూ.రూ.2019.19కోట్లను తాజాగా విడుదల చేసింది.
ఇక వచ్చే ఏడాది మాత్రం చెల్లింపులను ఏకమొత్తంగానే చెల్లించాలని భావిస్తోంది ప్రభుత్వం. నాలుగో విడుత చెల్లింపులను వచ్చే ఏడాది జూలైలో విడుదల చేస్తారు.