"చంద్రబాబు కుటుంబానికి రూ. 846 కోట్లు ఎలా వచ్చాయి?"
పెద్ద నోట్ల రద్దుతో చిన్న మొత్తాలు లభించక సామాన్యులు అల్లాడుతుంటే చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి పెట్టుబడులు పెట్టడానికి కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయని తెరాస ఎమ్మెల్యే కిశోర్ ప్రశ్నించారు.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చిన్న నోట్ల కోసం సామాన్యులు అల్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఆయన కుటుంబానికి 258 బిగ్ బజార్ ఔట్లెట్స్ తీసుకోవడానికి రూ.846 కోట్లు ఎలా వచ్చాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రశ్నించింది.
అంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ చెప్పాలని తెరాస శాసనసభ్యుడదు జి. కిశోర్ గురువారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. వేయి రూపాయల కోసం సామాన్యుడు విలవిలలాడుతున్నాడని, ఇటువంటి స్థితిలో చంద్రబాబు కుటుంబ సభ్యులు 258 బిగ్ బజార్ ఔట్లెట్స్ను తీసుకోవడానికి 846 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమేనని ఆయన అన్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలు నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేయడానికి తాము వ్యతిరేకమని తెరాస స్పష్టం చేసింది. పార్లమెంటును స్తంభింపజేయడాన్ని ఆపేసి పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరిగేలా చూడాలని తెరాస ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది.
రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై, దానివల్ల ఏర్పడిన కరెన్సీ కొరతతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై చర్చ జరిగేలా చూడాలని తెరాస పార్లమెంటు సభ్యుడు ఎపి జితేందర్ రెడ్డి ఢిల్లీలో లోకసభ స్పీకర్ను కోరారు.