కడుపు మండిన రైతులపై తెరాస రాజకీయ ముద్ర, దాటవేతకు యత్నం
ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి ధర దారుణంగా తగ్గించినందుకు కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగితే దానికి రాజకీయ పక్షాల ముద్ర వేసి ప్రభుత్వం దాటవేతకు ప్రయత్నించింది. నాటి నుంచి రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల
హైదరాబాద్: ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి ధర దారుణంగా తగ్గించినందుకు కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగితే దానికి రాజకీయ పక్షాల ముద్ర వేసి ప్రభుత్వం దాటవేతకు ప్రయత్నించింది. నాటి నుంచి రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల వద్ద భారీగా పోలీసులను మోహరించీ మరీ పంటల కొనుగోళ్లకు అనుమతినిస్తున్నది.
ఇక ఖమ్మం మార్కెట్ యార్డు పరిధిలోకి ఆధార్ కార్డు ఉంటే తప్ప రైతుకు మార్కెట్ యార్డులోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరిస్తున్న వైనం అందరికీ తెలుస్తూనే ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం ఒక్క విషయం మరిచిపోతున్నదేమిటంటే శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే పోలీసు బలగాల వినియోగం ఉపకరిస్తుంది కానీ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే ప్రతికూల ఫలితాలు దారుణంగా ఉంటాయి.
ఖమ్మం మార్కెట్ యార్డు చుట్టూ పోలీస్ నిర్బంధం
రైతులు ఆందోళనకు దిగిన తర్వాత ఖమ్మం మార్కెట్లో పరిస్థితి పరామర్శకు వెళ్లిన నేతలకు నగరం బయటే పోలీసుల బందోబస్తు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా పరిగణించరని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిర్చి కొనుగోళ్లు కేంద్రంతో ముడిపడి ఉన్న సమస్య గనుక కేంద్రంపై రుద్దేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారుల మెడలు వంచి మద్దతు ధర నిర్ణయించడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆందోళనకు దిగిన రైతులకు రకరకాల కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటడం విపక్షాల బాధ్యత
విపక్షాలు అంటేనే ప్రభుత్వ దుర్నీతిని నిలువరించడంతోపాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడానికి ఉన్నాయని అర్థం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న టీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీ సారథ్యంలో నడుస్తున్న దినపత్రిక 'నమస్తే తెలంగాణ'కు మాత్రం వాస్తవ పరిస్థితి ఈ సంగతేమీ బోధ పడటం లేదు. విపక్షాలపై నిర్హేతుకంగా దుమ్మెత్తిపోస్తూ విమర్శలకు దిగడమే పనిగా పెట్టుకున్నది. ఆశా కార్యకర్తలు సమ్మె చేసిన నాడు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. వేతనాల పెంపు సాధ్యం కాదన్నదీ ఇదే ప్రభుత్వం... ఈనాడు వేతనాలు పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడానికి నేపథ్యం ఏమిటి? ఏడాదిన్నరలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి 'ఆశా' కార్యకర్తలు భట్వాడా అయ్యారా? అన్న చిన్న ధర్మ సందేహం వ్యక్తమవుతున్నది.
నిరుద్యోగ ర్యాలీకి అడుగడుగునా అడ్డంకులు
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్తో సభ నిర్వహణకు సిద్ధమైతే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అనుమతి నిరాకరించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది. దీనిపై జేఏసీ నేతలు హైకోర్టుకు వెళితే మావోయిస్టులు ఉద్యమంలో ప్రవేశించారని పోలీసుల ఆరోపణ. ఊరిబయట సభ నిర్వహించుకుంటే సమ్మతమేనని వాదనను తీసుకొచ్చారు. శాంతిభద్రతల సమస్యను ముందుకు తీసుకొచ్చి.. మావోయిస్టులు ప్రవేశించారనే వాదన తేవడం ఉమ్మడి రాష్ట్రంలో నాటి సర్కార్ వాదననే తలపిస్తున్నదే తప్ప వాస్తవికత లోపించిందన్న విమర్శలు ఉన్నాయి.
నిరసన వ్యక్తీకరణ ప్రజల హక్కు.. ఆ హక్కు కాలరాస్తున్న సర్కార్
ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం ప్రజలు, పార్టీల హక్కు. కానీ దాన్ని హరించి వేస్తామని, ప్రజల నిరసనను, హక్కులను తానే అమలుచేస్తానని వాగాడంబర ప్రకటనలతో... కల్లబొల్లి కబుర్లతో కాలం గడిపితే సరిపోదు. నిజంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తే ఈ తరహా విమర్శలతో కూడిన వ్యాఖ్యానాలు రాయాల్సిన అవసరమే లేదు. కాదూ కూడదని వాచాలత్వానికి ప్రయత్నిస్తే.. మహామహులుగా పేరొందిన వారే మట్టికొట్టుకుపోయారన్న సంగతి పరిగణనలోకి తీసుకోవాలని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేసి.. తామే ప్రజా సమస్యలు పరిష్కరిస్తుంటే విపక్షాలు ఎందుకు తమతో కలిసిపోవాలనే తపనతో మసిబూసి మారేడు గాయ చేయాలని భావిస్తే అంతా తిరోగమన బాట పట్టక తప్పదని గతానుభవాలు చెప్తున్నాయి.
జేఏసీ చైర్మన్ ఇంటిపై పోలీసుల కిష్కింధకాండ
గమ్మత్తేమిటంటే నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు ఎక్కడ బయలుదేరతారోనన్న భయం.. ప్రస్తుత ప్రభువుల (ప్రభుత్వాధినేత) పట్ల భక్తి పోలీసులను ఆరాట పెట్టాయి. అందుకే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్గా జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం ఇంటికెళ్లిన పోలీసులు... అరాచక శక్తుల్లా విధ్వంస కాండకు దిగారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేసి మరీ ఆయన్ను అరెస్ట్ చేయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వాధినేతలది. అధినేతల ఆదేశాలతో అరెస్ట్ చేసిన ఘనత పోలీసులది. ఈ ర్యాలీకి తరలి వస్తున్న ప్రజలను జిల్లాల్లోనే పోలీసులు తమదైన శైలిలో అదలింపులు, బెదిరింపులతో అడ్డుకుని తమ ప్రభుభక్తిని చాటుకున్నారని వార్తలొచ్చాయి. ర్యాలీ జరిగితే విజయవంతం అయ్యేదో లేదో గానీ ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంటిపై పోలీసుల వీరంగంతోనే బ్రహ్మాండమైన ప్రచారం లభించింది.
వంధిమాగాధుల నిర్హేతుకమైన విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వాధినేత కేసీఆర్ చుట్టూ ఉన్న వంధి మాగాధులు తమపై, తమ అధినేతపై వచ్చే విమర్శలకు ప్రతిగా నిర్హేతుకమైన సవాళ్లతో కూడిన, హేతుబద్ధత లేని వాదంతో సమాధానం చెప్పడానికే ప్రయత్నిస్తున్నారే తప్ప.. వాస్తవిక ద్రుక్పథంతో వ్యవహరించే వారే కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆయా నేతల వ్యాఖ్యల్లో సానుకూల వాతావరణం నెలకొల్పే నిర్మాణాత్మక ద్రుక్పథమే కాన రావడం లేదు. విమర్శకులు సందర్భ శుద్ధి లేని విమర్శలతో కాలం గడుపుతున్నారు.
మంచి పనులు ప్రొజెక్ట్ చేయడంలోనూ విఫలమే
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పనులను కూడా ప్రజలకు తెలియజేయడంలో ఆయన సారథ్యంలోని 'నమస్తే తెలంగాణ' విఫలం అవుతున్నది. సానుకూల అంశాలతో కూడిన అంశాలను ప్రచారంచేస్తూ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలను కల్పించుకోవడంలో వెనుకబడుతున్నది. విమర్శకులు మరో సంగతి విస్మరిస్తున్నారు. విమర్శలు గుప్పించడంలో భాషా హద్దులు కూడా దాటేస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి. కొణతం దిలీప్ అనే విశ్లేషకుడు రాస్తున్న వ్యాసాలను 'నమస్తే తెలంగాణ' సరైన రీతిలో ప్రొజెక్ట్ చేయడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిరసన వినేందుకు ప్రభుత్వాధినేత నిరాకరణ
సమస్యల పరిష్కారానికి వేదిక ధర్నా చౌక్. వివిధ సామాజిక వర్గాలు, ప్రజాసంఘాలు, పార్టీల సారథ్యంలో సమాజంలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. కానీ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపే అవకాశాలకు కేసీఆర్ ప్రభుత్వం తెరదించాలని, తర్వాత పరిస్థితి మరింత అధ్వాన్నంగా మార్చాలని భావిస్తున్నది. నిరసన అనే పదం వినడానికే రాష్ట్ర ప్రభుత్వం వినేందుకు సిద్ధంగా లేదని తెలుస్తున్నది. అందుకే ధర్నా చౌక్ను నగర శివారుల్లోకి మార్చాలని సంకల్పించింది. కానీ ఇక్కడ ఒక విషయం విస్మరిస్తున్నది.
ధర్నాచౌక్ ఎత్తివేతతో తీవ్ర ప్రతికూల వాతావరణం
ధర్నాచౌక్లో సమస్యలపై గళమెత్తిన వారి బాదలు తెలుసుకుని, దాని పరిష్కారానికి పూనుకుంటే ఆయా వర్గాల్లో ప్రభుత్వం పట్ల సానుకూల ద్రుక్పథం ఉంటుందన్న సంగతి విస్మరిస్తున్నారు. ఇది దీర్ఘ కాలికంగా ప్రజల హక్కులపై, ప్రజాతంత్ర వాతావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజాతంత్ర వాదులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాధినేతను ఎదుర్కొనేందుకు అదే స్థాయిలో సామర్థ్యం గల నేత కోదండరాం. కనుక విపక్షాలు కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల ఆందోళనల్లో ఆయన చురుగ్గా పాల్గొంటూ ఆయా సామాజిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. కానీ ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొనడం పాలక పక్షానికి సుతారామూ ఇష్టం ఉన్నట్లు కనిపించడం లేదు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వం మూడున్నరేళ్ల క్రితం వరకు ఆందోళనలు చేపట్టిందీ ఇదే ధర్నా చౌక్ వద్దనన్న సంగతి విస్మరిస్తున్నది.