"టీఆర్ఎస్ చేస్తోన్న తప్పిదమదే.. ఇంతకీ సర్కార్ సక్సెసా? ఫెయిల్యూరా?"
హైదరాబాద్ : ఉద్యమ కాలంలో జోడెద్దుల్లా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్, కోదండరాం.. ఆ తర్వాతి కాలంలో ఎడమొహం-పెడమొహంగా మారిన సంగతి తెలిసిందే. ఇక గతకొద్ది రోజులుగా ప్రభుత్వంపై నిరసన పోరును ఉధృతం చేసే పనిలో పడ్డారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం. మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలోను.. రాష్ట్రంలో రైతన్నల సమస్యల పరిష్కారంలోను.. ప్రభుత్వం విఫలమవుతోందన్న వాదనను ఆయన గట్టిగా వినిపిస్తున్నారు.
తాజాగా సాక్షి చానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభుత్వంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోదండరాం. 'ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయినట్లా? ఫెయిల్ అయినట్లా?' అన్న ప్రశ్నకు కోదండరాం చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. టీఆర్ఎస్ తప్పుల్ని ఎత్తి చూపుతూ.. పాత అభివృద్ది విధానాల్నే ఇప్పటి ప్రభుత్వం చాలావరకు కొనసాగిస్తోందని, మనం వాటిని వదిలిపెట్టాల్సిన అవసరముందని కోదండరాం సూచించారు.
ఇందుకో ఉదాహరణ కూడా చెప్పారు కోదండరాం. కార్పోరేట్ విద్యాసంస్థలకు అనుమతులు లేకున్నా.. ల్యాబ్, గ్రౌండ్ వగైరా అనుమతులేవి లేకున్నా.. ఏమి అడగరు. అదే బతుకుదెరువు కోసం చిన్న కాలేజీ పెట్టుకుంటే.. నాలుగైదు సార్లు తనిఖీ చేసి వెళ్తారు. ఎందుకీ వ్యత్యాసం! అంటూ ప్రశ్నించారు.
తెలంగాణకు ఓ పెద్ద కంపెనీని తీసుకురావాల్సిన అవసరముంది, అదే సమయంలో ఇక్కడున్న చిన్న సూక్ష్మ పరిశ్రమల సంగతేంటి? అంటూ కోదండరాం ప్రశ్నించారు. వీళ్ల అవసరాలను ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఏదేమైనా.. ప్రభుత్వం సక్సెసా..? కాదా.. ? అన్న ప్రశ్నకు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. పరోక్షంగా ఫెయిల్యూరే అన్న సంకేతాలు ఇచ్చారు కోదండరాం.