'దేశంలొనే తొలిసారిగా రాష్ట్రంలో విదేశాంగ శాఖ!' : నిజమైతే కేటీఆర్ రికార్డు
హైదరాబాద్ : ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి వినూత్న కార్యచరణతో ముందుకెళ్తోన్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రానికి సంబంధించి త్వరలోనే సరికొత్త ఎన్నారై పాలసీని తీసుకొచ్చే యోచనలో ఉన్న కేసీఆర్ సర్కార్, మరో ఆసక్తికరమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోన్నట్టుగా తెలుస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే.. విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే విదేశాంగ శాఖను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎన్నారై పాలసీలే తప్ప విదేశాంగ విధానాలేవి అమలులో లేవు. కాగా, దేశంలోనే మొట్టమొదటి సారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక విదేశాంగ శాఖను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అభివృద్ది విషయంలో పెట్టుబడులు కీలకం కాబట్టి, విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలన్నా..! ఆయా దేశాలతో సంబంధాలతో మెరుగుపరుచుకోవాలన్నా..! విదేశాంగ శాఖదే కీలక పాత్ర. కాబట్టి రాష్ట్రంలో కూడా విదేశాంగ శాఖను ఏర్పాటు చేసి, ఇప్పటికే ఐటీ బాధ్యతలను, విదేశీ పెట్టుబడుల వ్యవహారాలను సమర్ధవంతంగా చక్కదిద్ధుతోన్న మంత్రి కేటీఆర్ కు ఆ శాఖ పర్యవేక్షణను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.
ఇంగ్లీష్ భాషపై మంచి పట్టుండడం, ప్రజెంటేషన్స్ ఇవ్వడంలో మంచి అవగాహన కలిగి ఉండడంతో కేటీఆర్ కే విదేశీ వ్యవహారాల బాధ్యతను అప్పగించాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారట. కాగా, ఇప్పటికే రూపుదిద్దుకున్న ఎన్నారై పాలసీకి సంబంధించి త్వరలోనే కీలక కేబినెట్ భేటీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ భేటీలోనే విదేశాంగ శాఖ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
విదేశాంగ శాఖ ఏర్పాటు ద్వారా అటు విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల యోగ క్షేమాలను పర్యవేక్షించడంతో పాటు పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించడానికి ఆ శాఖ ఉపయోగపడుతుందనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఏదేమైనా ఒకవేళ విదేశాంగ ఏర్పాటు గనుక ఖరారైతే దేశంలోనే తొలిసారిగా ఓ రాష్ట్రం తరుపున విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేయబోయే వ్యక్తిగా కేటీఆర్ ఘనతను సొంతం చేసుకోనున్నారు.