టీఆర్ఎస్ ఎదురు లేదని మరోసారి రుజువయింది... కేటీఆర్
తెలంగాణలో నిర్వహించిన స్ధానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్కు ఎదురు లేదని మరోసారి రుజువయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈనేపథ్యంలోనే రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూడ ఇదే తీరుగా విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు.
ఈనేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న జడ్పీ చైర్మన్ పదవులను కూడ కైవసం చేసుకునేందుకు మరోవైపు పావులు కదుపుతోంది. చైర్మన్ల ఎంపిక ప్రక్రియ కోసం జిల్లా ఇంచార్జాలను సైతం కేటీఆర్ నియమించారు. తెలంగాణ జిల్లాల వారిగా సీనియర్ నేతలను పార్టీ నాయకుల మధ్య సమన్వయం నేతలుగా నియమించారు. కాగా మరో కొద్ది గంటల్లో వెలువడనున్న జడ్పీటీసీలు, ఎంపీటీసీల ఫలితాల్లో కూడ ప్రజలు టీఆర్ఎస్కు ఏకపక్షంగా తీర్పు ఇవ్వనున్నారనే విశ్వాసంతో ఉన్నారు.
కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన రంగారెడ్డి ఎమ్మెల్సీ మహెందర్ రెడ్డి, నల్గోండ జిల్లా ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డితోపాటు వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస రెడ్డిలను కేటీఆర్ అభినందించారు.మరోవైపు వారి గెలుపుకు కృషి చేసిన మంత్రి శ్రీనివాస గౌడ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డిలతోపాటు తలసాని శ్రీనివాస యాదవ్, ఇతర పార్టీ నాయకులతోపాటు జిల్లాల నాయకులందరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.