పవన్ కళ్యాణ్ను టూరిస్ట్ అన్నారు: లక్ష్మణ్, '3కోట్ల'పై కెటిఆర్కు గట్టి కౌంటర్
హైదరాబాద్: నిజాం కళాశాలలో జరిగిన టిడిపి - బిజెపి బహిరంగ సభలో బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ తెరాస పాలన పైన నిప్పులు చెరిగారు. గతంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాదులో పేరు నమోదు చేయించుకోకుంటే అతనిని టూరిస్ట్ అంటూ విమర్శలు చేశారని గుర్తు చేశారు.
హైదరాబాదులో మూడో వంతు జనాభా ఉందని చెప్పిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు డాక్టర్ కె లక్ష్మణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులోనే మూడు వంతుల జనాభా ఉందని, అదే మూడొంతుల జనాభా 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెప్పిందని విమర్శించారు.
గతంలో ఆంధ్రా వారిని తెరాస నేతలు తిట్టిన మాటలు ఎవరూ మర్చిపోలేదన్నారు. తెలుగు తల్లిని తిట్టి తెలంగాణ తల్లి అన్నారని, లంకలో పుట్టిన వారంతా రాక్షసులే అన్నారని, ట్యాంకుబండు పైన ఉన్న విగ్రహాలను కూలగొట్టి ఏపీకి పంపిస్తామని చెప్పారని వ్యాఖ్యానించారు.
టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తెరాస పాలన పైన దుమ్మెత్తి పోశారు. ఓటర్లు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని, ఎవరు ఎవరికి ఓటు వేశారో తెలియకుండా ఉంటుందని, కాబట్టి ధైర్యంగా టిడిపి - బిజెపికి ఓటేయాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే డబుల్ బెడ్ రూం ఇళ్లు, తెలంగాణ లేదా హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందన్నారు. లేదంటే కెసిఆర్ అన్నీ విస్మరిస్తారని అభిప్రాయపడ్డారు.
బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాదులో టీడీపీ, బీజేపీ కూటమి పెద్ద పార్టీగా అవతరించనుందన్నారు. పంతొమ్మిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి హైదరాబాదులో 14 శాసనసభ స్థానాలను గెలుచుకుందన్నారు. టీఆర్ఎస్ రెండు స్థానాలే గెలుచుకుందని అన్నారు.
అలాగే రెండు ఎంపీ స్థానాలను టీడీపీ, బీజేపీ గెలుచుకుంటే, తెరాస ఏమీ గెలుచుకోలేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒకవైపు, టీడీపీ, బీజేపీలు మరోవైపు నిలబడ్డాయన్నారు. టీడీపీ, బీజేపీకి ఓటు వెయ్యకపోతే, ఆ ఓటు మజ్లిస్ పార్టీకి వేసినట్టేనన్నారు.
టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే హైదరాబాదీలు నల్లా నీళ్లుతాగారన్న విషయం గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మజ్లిస్ వల్లే హైదరాబాదులో గూండాయిజం నెలకొందని, రౌడీయిజానికి కారణం మజ్లిస్ అని ఆరోపించారు. ఈ గూండాయిజం, రౌడీయిజాన్ని అంతం చేయాలంటే టీడీపీ, బీజేపీకి ఓటేయాలన్నారు.