కింకర్తవ్యం: ఎస్టీ స్థానాల్లో అనిశ్చితిపై టెన్షన్, కెసిఆర్కు దారేది?
Recommended Video
హైదరాబాద్: చినికి చినికి గాలివానగా మారిన గిరిజన తెగల ఆందోళనలు, వచ్చే అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికల్లో ఆ వర్గాలు చూపే ప్రభావంపై అధికార పార్టీ టీఆర్ఎస్లో చర్చ మొదలైంది. ఆదివాసీలు, లంబాడీల మధ్య నెల రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో గిరిజన నియోజకవర్గాల్లో పరిస్థితిపై టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో గిరిజన స్థానాలన్నీ తామే గెలుచుకుంటామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటించిన నేపథ్యంలో గులాబీ పార్టీ హై కమాండ్ అప్రమత్తమైంది.
రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టే ఈ గొడవలను ప్రోత్సహిస్తోందంటూ ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు దాడి మొదలుపెట్టారు. ఉట్నూరు కేంద్రంగా జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అటు ఆదివాసీలు, ఇటు లంబాడీలు ఇరువురూ తమకు కావాల్సిన వారేనని అధికార పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఒక సందేశం పంపేందుకూ ప్రయత్నించారు.
ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లోనే టీఆర్ఎస్ గెలుపు
ఈ మేరకు గిరిజన నియోజకవర్గాలు అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల మంత్రులతో సీఎం కేసీఆర్ మంతనాలు జరిపారు. రెండు గిరిజన తెగల ఆందోళనలతో పార్టీ పరంగా నష్టం జరిగే అంశాలు, అవకాశాలపైనా చర్చ జరిగిందని చెబుతున్నారు. రాష్ట్రంలో 12 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గత సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్నది ఐదు స్థానాలే. కానీ ఆ తర్వాత జరిగిన చేరికల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక గిరిజన ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 11 గిరిజన స్థానాలు టీఆర్ఎస్ చేతిలోకి వెళ్లిపోయాయి. మరో స్థానంలో సీపీఎం ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ఉన్న రెండు ఎస్టీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి.
వాస్తవ పరిస్థితుల మదింపుపై ‘గులాబీ' పార్టీ ఫోకస్
తాజాగా గిరిజన తెగల మధ్య జరుగుతున్న ఆందోళనలు.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాత ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బోథ్, సిర్పూరు - టీ అసెంబ్లీ స్థానాల పరిధిలో పూర్తిస్థాయిలో ఆదివాసీలపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఖానాపూర్, బెల్లంపల్లి, నిర్మల్ నియోజకవర్గాల్లోనూ గణనీయంగా వారి ప్రాబల్యం ఉందని చెబుతున్నారు. పాత వరంగల్ జిల్లా పరిధిలోని భూపాల పల్లిలో ప్రభావం చూపే స్థాయిలో, ములుగులో పూర్తిగా ఆదివాసీ ఓటర్లే కీలకమని పేర్కొంటున్నారు. పాత ఖమ్మం జిల్లా పరిధిలోని భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేటల్లో ఆదివాసీల సంఖ్య ఎక్కువని.. డోర్నకల్, మహబూబాబాద్, దేవరకొండ, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో లంబాడీల ఓట్లు కీలకమని స్పష్టం చేస్తున్నారు.
రెండు లోక్ సభ స్థానాల్లోనూ ఆదివాసీలు, లంబాడాలు కీలకమే మరి
ఇక ఉన్న రెండు ఎస్టీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్లలో రెండు వర్గాలూ గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అటు ఆదివాసీలను, ఇటు లంబాడీలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. హైదరాబాద్లో తుడుందెబ్బ సభకు అనుమతించడం, ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు తమ తండాల మీద దాడులకు పాల్పడడంతో లంబాడీల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించే పనిలో పడ్డారని సమాచారం. ముఖ్యంగా పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నాలుగు ఎస్టీ నియోజకవర్గాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని.. ఆయా చోట్ల పార్టీకి కాయకల్ప చికిత్స చేసే వ్యూహంలో టీఆర్ఎస్ ఉందని సమాచారం.
ఉట్నూర్లో అధికారుల చర్చల్లో ఆదివాసీ నేతల డిమాండ్
ఇదిలా ఉంటే ఆదివాసీ, లంబాడీల మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం ఇరువర్గాలతో చర్చలకు దిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో సోమవారం వారితో చర్చలు జరిపిన వారిలో ఐటీడీఏ పీవో, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఐజీ వై.నాగిరెడ్డి, కరీంనగర్ డీఐజీ ప్రమోద్కుమార్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఉన్నారు. మొదట ఆదివాసీ నాయకులతో ఐటీడీఏ కార్యాలయంలో, ఆ తర్వాత రాత్రి కుమురంభీం కాంప్లెక్స్లో లంబాడీ నాయకులతో అధికారులు చర్చించారు. జిల్లాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అందరూ కలిసిరావాలని అధికారులు కోరారు. చర్చలు ముగిసిన తర్వాత వేర్వేరుగా మీడియాకు వివరాలను తెలిపారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఆదివాసీల ఉద్యమం ఆగదని ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు, ఆదివాసీ సంఘాల నాయకులు అధికారులకు స్పష్టం చేశారు. కుమురంభీం విగ్రహానికి చెప్పులదండ వేసిన వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన నాయకులు మర్సకోల తిరుపతి, ఆశారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాత ఆదిలాబాద్ జిల్లాలో తాత్కాలికంగా సద్దుమణిగిన ఘర్షణలు
లంబాడీలకు పూర్తిస్థాయి రక్షణ ప్రభుత్వం కల్పించాలని ఆలిండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అమర్సింగ్ తిలావత్ చర్చల్లో అధికారులను కోరారు. లంబాడీలను ఎస్టీలు కాదనే హక్కు ఎవరికీ లేదని అన్నారు. వలస లంబాడీలకు తాము కూడా వ్యతిరేకమని చెప్పారు. సమావేశంలో లంబాడీ నేతలు జాదవ్ రమణానాయక్, రామారావు, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీలో సోమవారం ఘర్షణలు సద్దుమణిగాయి. పాత జిల్లా పరిధిలో పోలీసు పహారా కొనసాగుతున్నది. ముగ్గురు ఐజీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఎలాంటి సంఘటన చోటుచేసుకోలేదు.