టీఆర్ఎస్ ఆర్టీసీని చంపే యత్నం చేస్తుంటే ....బీజేపీ వాటితో పబ్బం గడుపుకుంటుంది : పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీపై, అలాగే బీజేపీపై మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా తయారు చేసిందని ఆయన ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీని చంపే ప్రయత్నం చేస్తోందని పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్క లేదని ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీ కాదు వరస్ట్ సిటీ.. రోడ్లపై నాట్లేసి పొన్నం నిరసన
ఒకపక్క ఏపీ సర్కార్ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, సీఎం కేసీఆర్ మాత్రం అవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మరో నాలుగైదు రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేయనున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇక తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ విధంగా తయారైందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇక అంతే కాదు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పైన కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తోక పార్టీ అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్, బిజెపి లు రెండు పార్టీలు ఒక్కటేనని, అందుకే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి మరీ సంతోష్ బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చారని పొన్నం పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఎక్కడా మూడు వేల ఓట్లు కూడా రాని బిజెపి , కాంగ్రెస్ పార్టీని తోక పార్టీ అనడం దారుణమని ఆయన ఫైర్ అయ్యారు.
బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో టీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేశారని , ఇక వ్యాఖ్యలు నిజమైతే బిజెపి టిఆర్ఎస్ పార్టీ నాయకులపై సిబిఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రెండు తోడు దొంగలని ఒప్పుకోవాలన్నారు పొన్నం ప్రభాకర్. 370 రద్దుచేసి, ట్రిపుల్ తలాక్ గురించి చెప్పుకుంటూ ఇదంతా తాను సాధించిన ఘనత అని బిజెపి డప్పు కొట్టుకుంటున్నదని పొన్నం ప్రభాకర్ విమర్శనాస్త్రాలు సంధించారు.