టీఆర్ఎస్ లో ఆ పదవుల పంచాయితీ .. గులాబీ బాస్ కు నేతల వినతి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అధికారాన్ని చేతబట్టి ఒక వెలుగు వెలుగుతున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ . తెలంగాణా రాష్ట్రంలో ఎదురు లేకుండా రాజకీయంగా ముందుకు సాగుతున్న గులాబీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. వరుస ఎన్నికలలో విజయం సాధించినా పార్టీ శ్రేణులు ఎందుకు అసంతృప్తితో ఉన్నాయి అంటే అందుకు కారణం లేకపోలేదు. టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రులు ఇప్పుడు ఏ పదవి లేక,పట్టించుకునేవారు లేక తీవ్ర మనస్తాపంతో ఉన్నారని తెలుస్తుంది. నామినేటెడ్ పదవుల కోసం వారు ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కేటీఆర్ కు కొత్త కష్టాలు తెచ్చిన మునిసిపల్ ఎన్నికల వ్యూహం .. కేటీఆర్ ఏం చేస్తారో ?
తెలంగాణ భవన్,ప్రగతి భవన్ల చుట్టూ తిరుగుతున్న గులాబీ నేతలు
తెలంగాణా రాష్ట్రంలో రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. గులాబీ పార్టీ వరుసగా ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఎన్నికల హడావిడి లేదు కాబట్టి గులాబీ కేడర్ ఇప్పుడు అంతా తెలంగాణ భవన్,ప్రగతి భవన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకో పదవి కావాలంటూ గులాబీ నేతలు రిక్వెస్ట్లు పెడుతున్నారు. మరీ వారి కోరికను సీఎం కేసీఆర్ తీరుస్తారా? అన్నది ఇప్పుడు టీఆర్ఎస్ నేతలను కలవరపెడుతుంది.
పదవులు లేక ఇబ్బంది పడుతున్న కీలక నేతలు
తెలంగాణా రాష్రంలో చాలామంది కీలక నేతలు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఎలాంటి పదవులు లేకుండా నియోజకవర్గాల్లో తమ ప్రాధాన్యత లేకుండా పోతుందని ఆవేదనలో ఉన్నారు. ఇక తెలంగాణలో 2023 వరకు ఎలాంటి ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఇలా చాలా మంది నేతలు అవకాశం దక్కించుకున్నారు.
నామినేటెడ్ పదవుల కోసం ప్రదిక్షణలు
ఇంకా అవకాశాలు రాని వారు, పదవులు లేని గులాబీ పార్టీ కీలక నేతలు గులాబీ పార్టీలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. నామినేటెడ్ పదవులు దక్కుతాయి అని ఆశతో వారంతా ఇప్పటినుంచే గులాబీ బాస్ చుట్టూ, ప్రగతి భవన్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. కెసిఆర్ కంట్లో పడడానికి చాలా మంది నేతలు నానా తంటాలు పడుతున్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా విభిన్నమైన కార్యక్రమాలు చేపట్టి కెసిఆర్ దృష్టిని ఆకర్షించేందుకు చాలా మంది నాయకులు కష్టపడ్డారు . మరికొందరు నేతలు ఏకంగా ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్ను కలిసి మరీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. తమ పదవి విషయం ఆలోచించాలని కొందరు గులాబీ బాస్ కు తమ వినతులు తెలియజేస్తున్నారు .
Recommended Video
రాజ్యసభ,ఎమ్మెల్సీల కోసం కీలక నేతల పాట్లు
రాజ్యసభ పదవులు ఆశిస్తున్న నేతలు, ఎమ్మెల్సీ పదవుల కోసం వెయిట్ చేస్తున్న నేతలు ఈ పదవులు దక్కకపోతే వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వారు కూడా భవిష్యత్ రాజకీయాల విషయంలో సీరియస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకే నామినేటెడ్ పదవుల కోసం కేసీఆర్తో పాటు కేటీఆర్ను కలిసి తమ పరిస్థితి చెప్పుకుంటున్నారు . మొత్తానికి పదవుల విషయంలో గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న వారిని సీఎం కేసీఆర్ ఆ పదవులు ఇచ్చి కరుణిస్తారా లేదా అనేది వేచి చూడాలి .