10న బంద్తో డిఫెన్స్: కెసిఆర్ ఉన్నారని ప్రధాని అంటారా.. మోడీని లాగిన టిఆర్ఎస్
హైదరాబాద్: రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని లేదంటే ఈ నెల 10వ తేదీన బంద్కు పిలుపునిస్తామని ప్రతిపక్షాలు హెచ్చరించిన నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు జూపల్లి కృష్ణా రావు, బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
'రైతులకు రుణమాఫీ చేసినందుకు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారా? కాంగ్రెస్, టిడిపి పాలనల్లో కరెంట్ కోత లేని రోజు లేదు. టీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కోత లేదు. అందుకు బంద్ పాటిస్తున్నారా? వచ్చే మార్చి నుంచి 9గం. పాటు రైతుకు విద్యుత్ ఇస్తున్నందుకు బంద్ చేస్తున్నారా? చెప్పాలని జూపల్లి ప్రశ్నించారు.
మీరు ఇవ్వనటువంటి పంట నష్టం తమ ప్రభుత్వం ఇచ్చినందుకు బంద్ పాటిస్తున్నారా? అని నిలదీశారు. విపక్షాలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. విపక్షాలు కావాలనే సభను అడ్డుకుంటున్నాయన్నారు. కరువు రాష్ట్రంలో ఉండవద్దనే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
విద్యుత్లో త్వరలో మిగులు రాష్ట్రంగా తెలంగాణ కాబోతుందన్నారు. విపక్షాలు రైతు భరోసా యాత్ర ఎందుకు చేపడుతున్నాయన్నారు. మనం కడుతున్న ప్రాజెక్టులు కట్టవద్దని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రివ (చంద్రబాబు) చెబుతున్నారని, ఆయనకు మద్దతుగా యాత్రలు చేస్తున్నారా అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, ఢిల్లీ సాక్షిగా యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని అప్పుడు భరోసా ఎవరికిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం నాడు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎటువైపు ఉన్నారని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం టిఆర్ఎస్ గంటల్లో రాజీనామా చేస్తే, కాంగ్రెస్ నేతలు మాత్రం మూడు సంవత్సరాలు అయినా రాజీనామా చేయలేదన్నారు. అలాంటి వారు మానవత్వం గురించి, రైతుల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. రైతుల పట్ల తమ ప్రభుత్వం ఉదారంగా ఉందన్నారు.
నాగం జనార్ధన్ రెడ్డి కిసాన్ బచావ్ యాత్ర చేపట్టడం విడ్డూరమన్నారు. ప్రజలు పేదవారు కావొచ్చు, కష్టజీవులు కావొచ్చని, కానీ మీ నాటకాలు వారు చూస్తున్నారన్నారు. నాడు చంద్రబాబు రైతుల పైన బషీర్ బాగ్లో కాల్పులు జరిపినప్పుడు రైతు బచావో యాత్రను ఎందుకు చేపట్టలేదన్నారు.
రైతుల కోసం టిఆర్ఎస్ సాయం చేస్తోందని, కేంద్రం కూడా రైతులకు ఏదైనా సాయం చేసేందుకు ముందుకు రావాలని, బిజెపి నేతలు ఆ దిశగా ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క జూరాల కట్టేందుకే గత ప్రభుత్వాలకు 24 ఏళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
ఎన్నిరోజులైనా చర్చిద్దామి చెప్పాం: శ్రీనివాస్ గౌడ్
రైతు సమస్యల పైన ఎన్ని రోజులైనా చర్చిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ - బిజెపి మధ్య కేంద్రంలో కయ్యం, తెలంగాణలో నెయ్యంగా ఉందన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్య పైన కేంద్రానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
ప్రధానికి బాధ్యత లేదా?
అరవయ్యేళ్ల పాపం వల్లనే రైతులు చనిపోతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముప్పై, నలభై దేశాలు తిరిగారని, అలాంటి వ్యక్తి తెలంగాణలో జరిగే ఘటనలకు తనకు సంబంధం లేదని చెబుతారా అని ప్రశ్నించారు. తెలంగాణలో కెసిఆర్ ఉన్నారని, తనకు సంబంధం లేదని చెబుతారా అని ప్రశ్నించారు.
దేశంలో ఏదైనా సంఘటన జరిగితే ప్రధానిది కూడా బాధ్యత ఉంటుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏం జరిగినా ఎవరు మాట్లాడరని, తెలంగాణలో జరిగితే మాత్రం రాద్దాంతం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పసిగుడ్డు అడుగు వేస్తుంటే రాద్దాంతం సరికాదన్నారు.
ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తమకు అభ్యంతరం లేదని బాలరాజు అన్నారు. తెలంగాణకు సాయం పైన బిజెపి ఇరుకున పడిందని, దీంతో, తమ మెడకు చుట్టుకున్న దానిని అందరి మెడకు చుట్టాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. అందుకే పదో తారీఖున బందు వరకు వెళ్తున్నారన్నారు. టిడిపికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాగా, టీఆర్ఎస్ నేతల ఒత్తిడిలో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.