టీఆర్ఎస్కు షాక్: బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, కండువా కప్పిన అమిత్ షా
Recommended Video
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్ నేత, ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్తో కలిసి బాబుమోహన్ ఢిల్లీ వెళ్లారు.
కేసీఆర్ ఫాంహౌస్ చర్చలు: బాబు మోహన్, ఓదేలుకు బుజ్జగింపు, సురేఖ, దానంపైనా..
శనివారం మధ్యాహ్నం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా.. బాబుమోహన్కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నుంచి గెలుపొందన బాబుమోహన్కు తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ రద్దు అనంతరం 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. అందోల్ టికెట్ను బాబు మోహన్ను కాదని జర్నలిస్టు క్రాంతి కుమార్కు ఇచ్చారు. ఈ క్రమంలో ఎంత కష్టపడి పనిచేసినా కూడా టీఆర్ఎస్ పెద్దలు తనపై వివక్ష చూపుతున్నారని బాబుమోహన్ తన సన్నిహితుల వద్ద విచారం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ టికెట్ నిరాకరిచండంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అందోల్ టికెట్ ఇస్తామని బీజేపీ నుంచి తనకు హామీ లభించడంతోనే ఆయన ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అందోల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో బాబుమోహన్ చేరిక తమకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.