తొందరొద్దు, చూద్దాం: అనుచరులతో డీఎస్ భేటీ, కాంగ్రెస్లో చేరాలని ఒత్తిడి
నిజామాబాద్: టీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమైన రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ సోమవారం తన నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో ఓ హోటల్లో భేటీ అయ్యారని తెలుస్తోంది. తెరాసతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. డీఎస్ పైన కేసీఆర్ చర్యలు తీసుకుంటారని ప్రచారం సాగింది. అదే సమయంలో డీఎస్ రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరిగింది.
కానీ ఇప్పటి వరకు తెరాస అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రానందున వేచి చూసే ఆలోచనలో డీఎస్ ఉన్నారని తెలుస్తోంది. డీఎస్ విషయంలో అధిష్ఠానం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వంటి అంశాలు సోమవారం నాటి సమావేశంలో చర్చకు వచ్చాయని సమాచారం.
పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని ఈ సందర్భంగా డీఎస్ తేల్చి చెప్పారు. తనపై నేతలు చేసిన ఫిర్యాదుపై కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పిలుపులేదన్నారు. ఒకవేళ వారి ఫిర్యాదుపై పార్టీ అధిష్ఠానం కనుక చర్యలకు ఉపక్రమిస్తే కాంగ్రెస్లో చేరాలని అనుచరులు డీఎస్కు సూచించినట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి తనకు పిలుపు వచ్చిందని డీఎస్ సంకేతాలు ఇచ్చారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండడంతో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కొందరు నాయకులు చెప్పారని తెలుస్తోంది. మరికొందరు నాయకుల వాదన మాత్రం మరోలా ఉంది. ఏదో ఒక నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకుంటే నియోజకవర్గంలో ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని సూచించారు.
కాంగ్రెస్లో చేరితే గుర్తింపుతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెద్ద పదవే వస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా, డీ శ్రీనివాస్ను కలిసేందుకు వచ్చిన వారు ఎమ్మెల్సీ భరత్ రెడ్డిని కూడా కలిశారు.