భార్యాపిల్లల కళ్లముందే టీఆర్ఎస్ నేతను పొడిచి, కాల్చిచంపిన మావోయిస్టులు - ములుగు జిల్లాలో ఘాతుకం
ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని వెంకటాపురం మండంలోని అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత మాడూరి భీమేశ్వరరావును అతని భార్యాపిల్లలు చూస్తుండగానే అతి దారుణంగా హతమార్చారు. శనివారం అర్ధరాత్రి అతని ఇంట్లోకి చొరబడిన మావోయిస్టులు.. కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా పట్టించుకోకుండా కత్తులతో పొడిచి, తుపాకితో కాల్చి చంపారు.
హాథ్రస్ కేసులో మరో ట్విస్ట్: నక్సల్స్ ప్రమేయం - హైకోర్టుకు బాధిత కుటుంబం - సీబీఐ ఎఫ్ఐఆర్
అందుకే చంపేశాం..
టీఆర్ఎస్ నేత మాడూరి భీమేశ్వరరావును హతమార్చిన ఘటనలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పని తామే చేశామనడానికి రుజువుగా ఘటనా స్థలంలో మావోయిస్టులు ఓ లేఖను వదిలివెళ్లారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అండతో భీమేశ్వరరావు లాంటివాళ్లు ప్రజలపై పెత్తనం చేస్తున్నారని, ప్రశ్నించినవాళ్లను పోలీసులకు పట్టిస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, వాజేడు పరిధిలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై దాడులను వెంటనే నిలిపేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
పార్టీ ఫండ్ ఇవ్వనందుకే..
జిల్లాలో సంచలనం ఈ ఘటనపై ములుగు పోలీసులు స్పందించారు. సామాన్య ప్రజలపై మావోయిస్టుల హత్యాకాండ కొనసాగిస్తున్నారని ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులకు పార్టీ ఫండ్ తిరస్కరించినందుకే భీమేశ్వరరావును హత్య చేశారని, డబ్బులు ఇవ్వని సామాన్యులపై ఇన్ ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హత్యలకు పాల్పడుతున్నారని, ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తూ ఆటంకాలకు గురిచేస్తున్నారని ఎస్పీ వ్యాఖ్యానించారు. వెంకటాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం భీమేశ్వరరావు మృతదేహాన్ని బందువులకు అప్పగించారు.
చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే
Recommended Video
మావోయిస్టుల బలం పెరిగిందా?
సుదీర్ఘ కాలం తరువాత తెలంగాణలో మళ్లీ మావోయస్టుల కదలికలు పెరిగినట్లు వెల్లడికావడం, ఇటీవల పోలీస్ బాస్ స్వయంగా కొద్ది రోజులపాటు మకాం వేసి.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై సమీక్షలు నిర్వహించడం తెలిసిందే. పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు జరుగుతున్న సమయంలోనే మావోయిస్టులు దర్జాగా గ్రామంలోకి చొరబడి.. అధికార పార్టీకే చెందిన నేతలను దారుణంగా చంపడం సంచలనంగా మారింది. హత్య చేయడంతోపాటు టీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఇతర నేతలకు రాజీనామా చేయాలని వార్నింగ్ ఇవ్వడం ద్వారా ములుగు ప్రాంతంలో తమ బలం తగ్గలేదని మావోయిస్టులు స్టేట్మెంట్ ఇచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.