బీజేపీ ఆపరేషన్, కేసీఆర్కు 30 మంది లీడర్ల షాక్! టిడిపిలోనే రేవంత్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాలు సహా, కర్నాటకపై ప్రత్యేకంగా కన్నువేసింది.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాలు సహా, కర్నాటకపై ప్రత్యేకంగా కన్నువేసింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతంపై వ్యూహరచనలు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రానున్నారు.
మరోవైపు తెలంగాణలో ఇతర పార్టీల నుంచి పలువురు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇటీవల నందీశ్వర్ గౌడ్, ఆయన తనయుుడు అభిషేక్ గౌడ్లు కమలం పార్టీలో చేరారు. తెరాస నుంచి కూడా వలసలు కనిపిస్తున్నాయి.
తాజాగా, ఆసిఫాబాద్ జడ్పీటీసీ సభ్యుడు, రాష్ట్ర జడ్పీటీసీ సభ్యుల సంఘం అధ్యక్షుడు కొయ్యల ఏమాజి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తాను త్వరలోనే బీజేపీలో చేరుతున్నానని, తనతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 30 మంది జడ్పీటీసీ సభ్యులు టీఆర్ఎస్ఎస్ను వీడుతున్నట్లు తెలిపారు.
తెరాసకు ఏమాజీ రాజీనామా
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా కూడా ఉన్న ఏమాజి శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన రాజీనామాకు దారితీసిన కారణాలను వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం జడ్పీటీసీ సభ్యులకు నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందని ఏమాజీ మండిపడ్డారు. ఈ పరిస్థితులను జడ్పీ సమావేశాల్లో మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.
ఉద్యమిస్తే సస్పెండ్ అన్నారు
అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు పనులు చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని జడ్పీటీసీ సభ్యులు మానసికంగా కుంగిపోతున్నారని ఏమాజీ చెప్పారు. జిల్లా పరిషత్తులకు నిధులివ్వాలని ఉద్యమించినందుకు తనను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా మంత్రి రామన్న, ఎమ్మెల్సీ సతీష్లు ప్రకటించారన్నారు.
కేసీఆర్ అపాయింటుమెంట్ ఇవ్వలేదు
ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసు అందలేదని ఏమాజీ తెలిపారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టిడిపిలోనే ఉంటా.. రేవంత్ రెడ్డి
మరోవైపు, బీజేపీలోకి వెళ్తారనే ఊహాగానాలపై టిడిపి నేత రేవంత్ రెడ్డి స్పందించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని, తెలుగుదేశంలోనే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నిల్లో టిడిపిని గెలిపిస్తానని చెప్పారు.