బాబు విచారణకు సహకరించాలి: కవిత, విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం: మంత్రి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం గురించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని టీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో కేంద్రం ఏపీ సీఎం చంద్రబాబుకు అండగా ఉంటుందని తాము భావించడం లేదని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్కు లేఖ రాశామని ఆయన తెలిపారు. తెలుగుదేశం ముడుపులు కేసులో తప్పనిసరిగా చంద్రబాబు పేరుని చేర్చాలని కేశవరావు డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో స్టింగ్ ఆపరేషన్, ఫోన్ ట్యాపింగ్ లాంటివేవి జరగలేదని ఆయన చెప్పారు.
బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అంశం సీరియస్ వ్యవహారమని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు విచారణకు సహకరించాలి: కవిత
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్(బి)లో నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం పర్యటించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేసి, మహిళా సంఘం భవనంతో పాటు సహకార సంఘం భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం రూ.30 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం పనులు చేపడుతున్నట్లు చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు త్వరలోనే 25 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
పచ్చ పార్టీ కుట్రలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని అన్నారు. చంద్రబాబు కుట్రలను తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తోందని అన్నారు. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా బాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు విచారణకు సహకరించాలన్నారు.
చంద్రబాబును ఆంధ్రప్రజలు ఎప్పుడో తిరస్కరించారు: మంత్రి జగదీష్రెడ్డి
చంద్రబాబుని ఆంధ్రప్రజలు ఎప్పుడో తిరస్కరించారని తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక తెలంగాణ, ఆంధ్రా మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి బాబు పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు వ్వవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్గా దొరికినా, టీడీపీ నేతలు మాత్రం బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీబీ కేసుకు, టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వ జోక్యం లేదన్న ఆయన, తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికహక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ నేతలు చంద్రబాబు తోక పార్టీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గృహ నిర్మాణ శాఖలో రూ. 100 కోట్ల అవినీతి జరిగిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా సోయి తెచ్చుకుని బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాలని అన్నారు.