మీరా నీతులు చెప్పేది? పెద్దలను అవమానించడం అలవాటేగా.: రాహుల్కి కేటీఆర్ ఘాటు కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి కేటీఆర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆయన ప్రసంగంలో అసత్యాలు, అర్ధసత్యాలు తప్ప వాస్తవం పొరపాటున కూడా లేదన్నారు.
అంబేద్కర్కు కాంగ్రెస్ ఇచ్చిన గౌరవం అందరికీ తెలుసు..
కాంగ్రెస్ చరిత్రేంటో అందరికీ తెలుసన్నారు. అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చామనడం శుద్ధ అబద్ధమన్నారు. అంబేడ్కర్ను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించిందనడం దుర్మార్గమని.. ఆ మహనీయుడికి కాంగ్రెస్ఇచ్చిన గౌరవమేంటో అందరికీ తెలుసన్నారు. అంబేడ్కర్కు భారతరత్న పురస్కారం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అంబేడ్కర్ చనిపోయిన తర్వాత 34 ఏళ్లకు వీపీ సింగ్ ప్రభుత్వమే భారతరత్న ప్రకటించింది గానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నారు.
మాకు సంస్కారం ఉంది..
నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కన్నీళ్లను స్వయంగా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఏర్పడ్డాక సాగునీరు, తాగునీటిని ప్రజలకు శరవేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లో తప్పిదాలను సవరించే క్రమంలో విశ్రాంత ఇంజినీర్లు, మేధావులను సంప్రదించారని వివరించారు. అంతే తప్ప తాము అంబేడ్కర్ పేరును తొలగించలేదన్నారు. మహనీయులను గౌరవించుకొనే సంస్కారం తమకుందన్నారు.
పీవీని ఎలా అవమానించారో మరిచిపోరు
ఎవరు పడితే వారు ఇచ్చిన స్క్రిప్ట్లను ఎటుబడితే అటు చదివితే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు పెద్దలను గౌరవించే సంస్కారం లేదన్నారు. దేశానికి ఐదేళ్లు ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహారావును ఏవిధంగా అవమానించారో తెలుగు ప్రజలు మరిచిపోలేదన్నారు. ఢిల్లీలో పీవీ సమాధి నిర్మాణానికి కూడా కాంగ్రెస్ అనుమతించలేదని మండిపడ్డారు. ఆయన పార్థీవదేహాన్ని హైదరాబాద్కు పంపించారన్నారు. పెద్దలను అవమానించడం కాంగ్రెస్ పార్టీకి అవాటేనని అన్నారు. టీఆర్ఎస్ కేవలం నాలుగేళ్లలోనే పార్టీ పరంగా తేడాలు చూడకుండా తెలంగాణలో గొప్ప మహానుభావుల పేర్లను యూనివర్సిటీలు, జిల్లాలకు పెట్టి గౌరవించుకున్న ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు కేటీఆర్. రాజకీయాల కోసం చిల్లర విమర్శలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాజకీయాల్లో ముందుకెళ్లాలనే ఉత్సాహంతో రాహుల్ ఉన్నారు గానీ.. తప్పులను సవరించుకుంటే మంచిదంటూ చురకలంటించారు.
యూపీఏ ప్రభుత్వ చట్టం వల్లే వ్యయం పెరిగింది
రూ.36వేల కోట్ల ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచారని రాహుల్ మరో అబద్ధం చెప్పారని, లెక్కలతో సహా మాట్లాడితే మంచిదని కేటీఆర్ సూచించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లకు కాంగ్రెస్ హయాంలోనే పెంచారని గుర్తు చేశారు. 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం వల్లే ప్రాజెక్టుల వ్యయం పెరిగిందని స్పష్టంచేశారు. ఎక్కువ ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశంతోనే ప్రాజెక్టులకు పునరాకృతి చేశామన్నారు.
రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా?
కాంగ్రెస్ ప్రభుత్వం 16 టీఎంసీల సామర్థ్యం కల్గిన ప్రాజెక్టుకే డిజైన్ చేస్తే.. దాన్ని కేసీఆర్ 160 టీసీఎంలకు పెంచారని తెలిపారు. రాహుల్గాంధీ ముత్తాత ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు 2014లో పూర్తయిందని గుర్తు చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితులు ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు. ప్రాజెక్టులపై కేసులు వేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నది కాంగ్రెస్ నేతలేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 6గంటల విద్యుత్ కూడా ఇవ్వలేదని, రైతులకు అవసరమైన నీరు, విద్యుత్, పెట్టుబడి ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, వలసలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. కర్ణాటకలో ఒకే విడతలో రుణమాఫీ చేశారనేది పచ్చి అబద్ధమని, కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీలో తెలంగాణవిధానాన్నే అనుసరిస్తున్న విషయం రాహుల్కు తెలిసినట్టు లేదంటూ చురకలంటించారు.
తెలంగాణకు నష్టం చేసిందెవరు?
‘ఉద్యోగాల క్రమబద్దీకరణను అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలు కాదా? తెలంగాణ ప్రజలకు మేలు జరిగే ముల్కీ రూల్స్ను తొలగించింది ఇందిరాగాంధీ ప్రభుత్వం కాదా? 371డి నిబంధన తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ముల్కీ రూల్స్ చెల్లుతాయని చెప్పిన తీర్పును సుప్రీంలో సవాలు చేసింది ఏ ప్రభుత్వం' అని కేటీఆర్ ప్రశ్నించారు. 60 ఏళ్లపాటు ఉద్యోగాల్లో తెలంగాణకు నష్టం జరిగేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. మైనార్టీల మీద కాంగ్రెస్ హఠాత్తుగా ప్రేమ కురిపిస్తోందని, మత కలహాలు ఎక్కువగా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో ఒక మత ఘర్షణ కూడా జరగలేదని, రాష్ట్రంలో నాలుగేళ్లుగా మతసామరస్యం వెల్లివిరిసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
చార్మినార్ వద్ద సుహృద్భావ యాత్రలో రాహుల్..
ప్రధాని నరేంద్ర మోడీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశచరిత్రలోనే ఒక ప్రధాని ఇలా చేయడం తొలిసారని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్లోని చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావన యాత్రలో రాహుల్ పాల్గొన్నారు. తొలుత ఆయన రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. విద్వేషాలు సృష్టిస్తోన్న మోడీకి ఎంఐఎం ఎందుకు మద్దతిస్తోందని ప్రశ్నించారు. అనంతరం తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యను ఘనంగా సన్మానించారు. రాజీవ్ సుహృద్భావ అవార్డు ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లిన రాహుల్ అక్కడ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఇది ఇలా ఉండగా, రోశయ్య హయాంలోనే ఎక్కువ అల్లర్లు జరిగాయని, నాలుగుసార్లు కర్ఫ్యూ విధించారని, అలాంటి నేతకు అవార్డు ఇవ్వడం హాస్యాస్పదమని మంత్రి కేటీఆర్ విమర్శించారు.