ఓయూ విద్యార్థులపై కెసిఆర్ కక్షగట్టారు: జగ్గారెడ్డి
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులపై తెలంగాణ సిఎం కెసిఆర్ కక్ష కట్టినట్టు కన్పిస్తోందన్నారు మాజీ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కెసిఆర్ కు ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్ళే పరిస్థితి లేదన్నారు.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులపై తెలంగాణ సిఎం కెసిఆర్ కక్ష కట్టినట్టు కన్పిస్తోందన్నారు మాజీ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కెసిఆర్ కు ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్ళే పరిస్థితి లేదన్నారు.
అందుకే ఓయూలో ఎవరూ కూడ సభలు పెట్టకూడదని జీవోలు తెచ్చారన్నారు. కెసిఆర్ కుటుంబసభ్యులు ఓయూకు వెళ్తే చెప్పులు, రాళ్ళు పడతాయన్నారు. ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. అలాంటి యూనివర్శిటీపై ఆంక్షలు దుర్మార్గమన్నారు.
ఉస్మానియాలో రాహుల్ గాంధీతో సభ పెడతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందన్నారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్న యూనివర్శిటీకి వెళ్ళలేని కెసిఆర్ ఒక ముఖ్యమంత్రేనా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తమ్ ఆధ్వర్యంలో యూనివర్శిటీలో సభను నిర్వహించి తీరుతామన్నారు జగ్గారెడ్డి.
విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో కెసిఆర్ కు విద్యార్థులు తగిన బుద్దిచెప్తారన్నారు. తక్షణమే ప్రభుత్వం జీవోను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.