ఇంత జులుమా?: రూ.30కోసం రచ్చ, కత్తులతో రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేత కుమారుడు
టోల్ ఫీజు చెల్లించాలంటూ సిబ్బంది అడగడమే ఆలస్యం.. వారిపై విరుచుకుపడ్డాడు. సిబ్బందిపై దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలవగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ను అడ్డుపట్టుకుని సామాన్య జనం మీద జులుం ప్రదర్శించే.. నాయకుల పుత్ర రత్నాలకు ఈరోజుల్లో కొదువలేదు. విషయమేదైనా సరే, ఎదుటివాళ్ల మీద నిర్దాక్షిణ్యంగా దాడి దిగడం.. కేసు దాకా వెళ్తే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవడం షరా మామూలైపోయింది.
తాజాగా హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ టీఆర్ఎస్ కార్పోరేటర్ కుమారుడు వీరంగం సృష్టించాడు. టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకే.. కత్తులతో సిబ్బందిపై దాడికి దిగాడు. వారిని పరిగెత్తించి పరిగెత్తించి దాడి చేసినట్లు సీసీటీవి ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.
పీకల్లోతు మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి.. స్నేహితులతో కలిసి రాష్ డ్రైవింగ్ చేస్తూ టోల్ గేట్ వద్దకు వచ్చాడు. టోల్ ఫీజు చెల్లించాలంటూ సిబ్బంది అడగడమే ఆలస్యం.. వారిపై విరుచుకుపడ్డాడు. సిబ్బందిపై దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలవగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, దాడి చేసిన వ్యక్తిని బీఎన్ రెడ్డి కార్పోరేటర్ లక్ష్మీ ప్రసన్న కుమారుడిగా గుర్తించారు. సోమవారం రాత్రి 9.30గం. ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దాడి అనంతరం నిందితులు కారులో పారిపోతుండగా.. మంకాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు యువకులపై ఐపీసీ సెక్షన్-307కింద కేసు నమోదు చేశారు.
గాయపడ్డ ముగ్గురి సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. కేవలం రూ.30 టోల్ ఫీజు కోసమే ఈ గొడవ జరిగిందని, ప్రాణ భయంతో టోల్ సిబ్బంది కేకలు వేస్తూ పరిగెత్తారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.