మంత్రి సమక్షంలో నిప్పంటించుకున్న అయూబ్ ఖాన్ మృతి
హైదరాబాద్: తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో గత నెలలో నిప్పంటించుకున్న టీఆర్ఎస్ నేత, వికారాబాద్ జిల్లా తాండూరు పట్లణ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్(52) అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు.
తాండూరు పట్టణంలో ఆగస్టు నెలలో స్థానిక సమ్మద్ ఫంక్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో అయూబ్ ఖాన్ తనకు అన్యాయం జరిగిందంటూ మనస్తాపానికి గురై మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలోనే ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి, టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు వాహనంలో స్థానిక జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయనిధి కింద వైద్య ఖర్చుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. దాదాపు నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
కాగా, అయూబ్ఖాన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆది నుంచి టీఆర్ఎస్లో ఉన్న ఆయన.. తనకు నియమిత పదవి రాలేదంటూ ఆవేదనకులోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అయూబ్ఖాన్ మృతి నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయన మృతదేహానికి మధ్యాహ్నం లేదా సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మంత్రి మహేందర్రెడ్డి ఆస్పత్రికి వెళ్లి అయూబ్ఖాన్ మృతదేహానికి నివాళులు అర్పించారు.