రాత్రిపూట అమ్రాబాద్ అడవుల్లో టీఆర్ఎస్ నాయకుడు.. కలకలం రేపుతోన్న ఆ నేత వ్యవహారం..
అతను అధికార పార్టీ నాయకుడు. గుప్త నిధుల కోసం అడవి బాట పట్టాడు. తన అనుచరగణాన్ని వెంటేసుకుని అటవీ ప్రాంతంలోని ఓ ఆలయంలో తవ్వకాలు జరిపాడు. విషయం స్థానిక గిరిజనులు,చెంచులకు తెలిసింది. దీంతో అతని వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తప్పించుకుని పారిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎట్టకేలకు సదరు నాయకుడి వ్యవహారం బయటపడింది. ఇంతకీ ఎవరా నాయకుడు.. ఎక్కడ ఆ గుప్త నిధుల వేట..
ఎవరా నాయకుడు
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ రేంజ్ పరిధిలోని భ్రమరాంబికాదేవి ఆలయంలో హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పి.తిరుమలేష్ నాయుడు అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టారు. గుప్త నిధుల కోసం ఆలయంలోని విగ్రహాన్ని పెకిలించి తవ్వకాలు జరిపారు. మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో తిరుమలేశ్ నాయుడు తన కారులో అక్కడినుంచి తిరిగి వెళ్లిపోతుండగా స్థానిక గిరిజనులు,చెంచులు గుర్తించారు.
ఈ నెల 8న రెక్కీ..
తన అనుచరులు ఎల్లప్ప, బాలస్వామి, శ్రీనులతో పాటు డ్రైవర్ షహబాజ్ అలీలతో కలిసి తిరుమలేశ్ ఆమ్రాబాద్ అడవిలోకి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు తిరుమలేశ్ నాయుడితో పాటు అతని అనుచరులను పట్టుకున్నారు. విచారణలో నిందితులు నిజం ఒప్పుకున్నారు. మొదట ఈ నెల 8వ తేదీన అడవిలో రెక్కీ నిర్వహించి.. సోమవారం(ఫిబ్రవరి 10) సాయంత్రం గుప్త నిధుల తవ్వకాల కోసం అడవిలోకి వెళ్లినట్టు చెప్పారు.
గతంలో రెండు కేసుల్లో..
తిరుమలేశ్ నాయుడు గతంలో రెండు కేసుల్లో రిమాండ్కు కూడా వెళ్లి బెయిల్పై వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ మార్చిస్తానని చెప్పి.. ఓ ఇన్స్పెక్టర్తో కలిసి పలువురిని మోసం చేసిన కేసులో తిరుమలేశ్ నాయుడు రిమాండ్కు వెళ్లాడు. అంతకుముందు నార్సింగిలోని ఓ భూ సెటిల్మెంట్ విషయంలోనూ అతను జైలుకు వెళ్లి వచ్చాడు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు..
గతంలో నమోదైన రెండు కేసులపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. వాటిపై విచారణ జరుగుతుండగానే తిరుమలేశ్ నాయుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తిరుమలేశ్ నాయుడు వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. గతంలోనూ ఇలా గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా,తిరుమలేశ్ నాయుడు గతంలో కాంగ్రెస్లో ఉండేవాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరాడు.