గులాబీ పార్టీలో మార్కెట్ కమిటీ నేతల సవాళ్లు: ఇటు స్పీకర్.. అటు ఎమ్మెల్యేపై అసమ్మతి
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. మరో ఏడాదిన్నర కాలం మాత్రమే సార్వ్రతిక ఎన్నికలకు సమయం ఉండటంతో ప్రజాప్రతినిధులకు, శ్రేణులకు ఇప్పటివరకు అంతర్గతంగా లోలోపల ఉన్న అసంతృప్తి భగ్గుమంటోంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఆయన కుమారులే లక్ష్యంగా పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శలు సంధిస్తే.. సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం రూ.13 లక్షలు ముడుపులు చెల్లించానని ప్రకటించడం సంచలనం స్రుష్టిస్తున్నది. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి వ్యతిరేకంగా రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన వీడియో అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు స్రుష్టించింది. స్పీకర్కు సన్నిహితంగా ఉండే పోలేపల్లి శ్రీనివాస్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల తీరుతో భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీకి, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్కు పంపిన వీడియో బయటికి రావడం కలకలం రేపింది.
అయితే శ్రీనివాస్ రెడ్డి ఆరోపణల వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా, హార్దికంగా అంగ బలం గల సదరు నాయకుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి స్థానం నుంచి తన కూతురుకు టిక్కెట్ ఇప్పించుకోవాలనే తపనతో ఉన్నాడని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసమే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఓటమి పాలు కావడాన్ని సాకుగా చూపి.. స్పీకర్ మధుసూదనాచారి చరిస్మాను తగ్గించేందుకు కుట్ర పూరితంగా ఆ నేత తన అనుచరుడైన పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి ద్వారా ఆరోపణల బాణాలు సంధించారని విమర్శలు వినిపిస్తున్నాయి.
సిరికొండ ముఖ్య అనుచరుడి ఆరోపణలతో ఇలా కలకలం
స్పీకర్ వ్యవహార శైలి సరిగ్గా లేదని ఆయన కుమారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, అందువల్లే సింగరేణి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని శ్రీనివాస రెడ్డితో చెప్పించడం వల్ల ప్రజలతోపాటు టీఆర్ఎస్ అధి నాయకత్వాన్ని నమ్మించొచ్చని ఎత్తు వేశారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చూసిన విపక్షాల నాయకులు భూపాలపల్లిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. నేరుగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ గురించి శ్రీనివాస రెడ్డి మాట్లాడడమే వాస్తవ పరిస్థితులను తెలియజేస్తున్నదని చెబుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట మండల వాసి పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్నారు. స్పీకర్ మధుసూదనాచారికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. అందువల్లే పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి నాయకుల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నా శ్రీనివాసరెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేయడంలో తీవ్రంగా క్రుషి చేశారు స్పీకర్ మధుసూదనాచారి.
పార్టీ శ్రేయస్సు కోసమే బయటపెడుతున్నానన్న శ్రీనివాసరెడ్డి
ఉద్యమం సమయంలో పని చేసిన కార్యకర్తల శ్రేయస్సు కన్నా స్పీకర్కు కన్న కొడుకుల ప్రయోజనాలే ముఖ్యంగా మారాయని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తల పనులను చూడకుండా కమీషన్లకు కక్కుర్తి పడుతూ కొడుకులతో బెదిరింపులకు గురిచేస్తున్నందు వల్లే స్పీకర్కు దూరం కావాల్సి వచ్చిందని చెప్పారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి.. స్పీకర్ మధుసూదనా చారి, కొడుకుల ప్రవర్తనపై మరోసారి పలు ఆరోపణలు చేశారు. 2001లో టీఆర్ఎస్లో చేరానని, మధుసూదనాచారి గెలుపు కోసం ఎంతగానో శ్రమించానన్నారు.
సిరికొండపై వ్యూహాత్మక దాడి ఇలా
ఇప్పుడు తనను చిన్నచూపు చూడడం, తాను చేసిన సహాయాన్ని మరిచిపోయి స్పీకర్, ఆయన కొడుకులు ప్రవర్తించిన తీరు మనస్తాపానికి గురిచేసిందని శ్రీనివాస రెడ్డి అన్నారు. రూ.30లక్షలతో జోగంపల్లి సమ్మక్క, సారలమ్మ జాతర వద్ద చేపట్టిన పనుల్లో రూ.3.28 లక్షల పర్సంటేజీ తీసుకున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు అప్పగించిన ప్రతి సీసీ రోడ్డు పనిలో రూ.10 వేలు కమీషన్ కావాలని కోరడం తనను విస్మయానికి గురిచేసిందన్నారు. పార్టీ అభివృద్ధి కన్నా కొడుకుల ప్రయోజనాలే స్పీకర్ మధుసూదనాచారికి ముఖ్యంగా మారాయని, దీంతో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని, స్పీకర్ అవినీతి, అక్రమాలపై 24 వీడియోలు బయటపెడతానని చెప్పారు. ఆధారాలతోనే మీడియా ముందుకు వస్తున్నానని వెల్లడించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ భాస్కర్కు ఓఎస్డీగా ఉద్యోగం ఇచ్చి ప్రతినెలా ఇస్తున్న రూ.1.50 లక్షల వేతనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం సరఫరా చేసిన ఒక్కో ట్రాక్టర్కు రూ. లక్ష చొప్పున వసూలు చేసి సబ్సిడీ ట్రాక్టర్లను అనర్హులకు అందజేశారన్నారు. భూపాలపల్లిలో స్పీకర్, ముగ్గురు కొడుకుల నుంచి పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆయనకు దూరం కావాల్సి వచ్చిందని శ్రీనివాస్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో స్పీకర్ రెండో కుమారుడు సిరికొండ ప్రశాంత్ తనపై దాడిచేసే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ కుమారుల అవినీతి, అక్రమాలపై, తన ఫిర్యాదులపై పార్టీ నాయకత్వం వెంటనే దృష్టి సారించి తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.13 లక్షల ముడుపులు చెల్లించానన్న బిడకన్నె
మరోవైపు సంగారెడ్డి జిల్లా పరిధిలో నారాయణ ఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బిడకన్నె హన్మంతు ఆ పదవి కోసం నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి రూ. 13 లక్షలు లంచం ఇచ్చానని ఆరోపించారు. ఇందుకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బార్య ఖాతాలో జమ చేసినట్లు సదరు చలాన్ కూడా చూపారు. గత ఏడాది అక్టోబర్లో మూడు లక్షల రూపాయల నగదును ఎమ్మెల్యేకు ఇచ్చానన్నారు. రూ.పది లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ఎమ్మెల్యే భార్య జయశ్రీ రెడ్డి అకౌంట్కు బదిలీ చేశానన్నారు. ‘‘నారాయణఖేడ్ మార్కెట్ చైర్మన్ పదవిని నాకు ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి కోరాను. ఎమ్మెల్యే నుంచి లేఖ తెచ్చుకోవాలని చెప్పారు. దాంతో, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని కలిసి సిఫారసు లేఖ ఇవ్వాలని కోరాను. ఆ పదవి కోసం ఇప్పటికే ముగ్గురు పోటీ పడుతున్నారని, నీకు పదవి కావాలంటే రూ.13 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే అడిగారు. ఆ మేరకు డబ్బు చెల్లించాను. ఆ డబ్బులతోనే ఎమ్మెల్యేకు స్కార్పియో వాహనం ఇప్పించాను'' అని హన్మంతు తెలిపారు. ఎమ్మెల్యేపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, తన ఆరోపణలు తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
ముడుపులు తీసుకోలేదని ఎమ్మెల్యే వివరణ ఇలా
వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు నుంచి చేబదులు డబ్బులు తీసుకున్నానని, ఆ తర్వాత ఇచ్చేశానని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తెలిపారు. హన్మంతు నుంచి తీసుకున్న డబ్బులకు, చైర్మన్ పదవికి సంబంధం లేదన్నారు. ‘ముక్టాపూర్ తదితర గ్రామాల్లో ఉన్న పనికి రాని 585 ఎకరాలను దళితులకు భూ పంపిణీ కోసం ప్రభుత్వంతో కొనుగోలు చేయించేందుకు హన్మంతు ప్రయత్నించారు. జిల్లా స్థాయి అధికారులతో కలిసి కొనుగోలును కొలిక్కి తెచ్చారు. ఈ విషయం నాకు తెలియగానే మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లి నిలిపి వేయించాను. అందుకే హన్మంతు నాపై కక్షకట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు' అని తెలిపారు.