'నయీం బాధితులు తెరాస వాళ్లే, కోమటిరెడ్డి ఆర్థిక సాయం చేశారా'
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో అధికార పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇతర నేతల ఆరోపణల పైన తెరాస నేతలు మంగళవారం నాడు స్పందించారు. వారి ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు.
'వైయస్ బతికుంటే నయీం పని అప్పుడే క్లోజ్ అయ్యేది'
ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, తెరాస నేత గాదరి కిషోర్ తదితరులు విలేకరులతో మాట్లాడారు.
నయీంను పెంచి పోషించింది మీరే
క్రూరమైన మృగం లాంటి నయీంను పెంచి పోషించింది ఎవరు అని తెరాస నేతలు ప్రశ్నించారు. అంతకుముందు టిడిపి, ఆ తర్వాత పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అలాంటప్పుడు అతనిని ఎవరు పెంచి పోషించారో అర్థం చేసుకోవాలని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి చెప్తే ఏం చేయలేదని చెప్పారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చాలా కఠినంగా ఉందన్నారు. ఎక్కడైనా ఏమైనా క్రైం జరిగితే తమ ప్రభుత్వం హయాంలో వెంటనే స్పందిస్తున్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
కలిసి పని చేస్తామన్నారుగా..
అవసరమైతే కేసీఆర్తో కలిసి పని చేస్తామని ప్రకటనల మీద ప్రకటనలు చేశారని గతంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇప్పుడు చేసే ఆరోపణలు సరికాదన్నారు. సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) విచారణ పైన నమ్మకం లేదనటం సరికాదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీయే ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ప్రసంసలు కురిపించారని గుర్తు చేశారు. నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్, టిడిపిలే అన్నారు. తప్పు ఎవరు చేసినా తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని హర్షించలేకపోతున్నారన్నారు. ఉనికి కోల్పోతామనే కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం పట్టుకుందన్నారు.
పార్టీ బాధ్యలపై ఎద్దేవా
తమకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తెరాసకు ధీటుగా నిలబెడతామని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల పైన కూడా స్పందించారు. ఆ వ్యాఖ్యలు సరికాదన్నారు. అధికారం కోల్పోయేసరికి కోమటిరెడ్డి మతితప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
వారి అధిష్టానంకు ఎవరికి బాధ్యతలు అప్పగించాలో తెలుసన్నారు. కానీ అమాయకుడిలా నాకు నాయకత్వం కావాలని చెప్పడం విడ్డూరమన్నారు. కావాలంటే మీ అధినాయకత్వం వద్దకు వెళ్లి తనకు నాయకత్వం ఇవ్వాలని సూచించారు. అంతేకానీ టీవీల్లో, పేపర్లలో మాట్లాడటం సరికాదన్నారు.
గూండా గిరి చేసి రాజకీయాల్లో ఎదిగింది మీరు
గూండా గిరి చేసి రాజకీయాల్లోకి వచ్చింది, ఎదిగింది మీరు అని కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి అన్నారు. అభివృద్ధిని ఓర్వలేక వారు తమ పైన ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎవరు పెద్ద ఎత్తున వెనుకేసుకున్నారో తెలుసునని అభిప్రాయపడ్డారు.
తెరాస పార్టీలోకి వస్తానని మీరే చెబుతారని, మళ్లీ రానని మీరే చెబుతారన్నారు. నయీం తనను కూడా బెదిరించాడని కోమటిరెడ్డి చెప్పారన్నారు. అక్రమ దందాలకు కేరాఫ్ అడ్రస్ కేరాఫ్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు, కమీషన్లతో తాము రాజకీయాల్లోకి రాలేదన్నారు.
నయీంకు సామంతరాజులా సంజీవ రెడ్డి, పోలీసుల అదుపులో టీవీ ఛానల్ ప్రతినిధి
నేను కూడా నయీం బాధితుడినే అని, తన పైన ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీరేశం అన్నారు. మిమ్మల్ని చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. కోమటిరెడ్డి సోదరులకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. మీ ఊరికి వచ్చి నిలదీస్తామన్నారు.
నేను నయీం బాధితుడిని అంటూ, తమ పైన (తెరాస నేతలు) కోమటిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, మరి నేను కూడా నయీం బాధితుడినే అని, అలాంటప్పుడు మీరు కూడా ఆ గ్యాంగ్స్టర్కు ఆర్థిక సాయం అందించారా అని నిలదీశారు.
కేసీఆర్ పైన ఏ రాజకీయ నాయకుడి మాట్లాడినా..
ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఏ రాజకీయ నాయకుడికి మాట్లాడే నైతిక హక్కు లేదని పూల రవీందర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం అరణ్యవాసంలో కుటుంబాన్ని వదిలి పెట్టి ఉద్యమించారన్నారు. అతని పైన ఉమ్మేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లే అన్నారు. సీఎం మంచి విజన్తో పని చేస్తున్నారన్నారు.
బాధితులం మేమే: పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెరాసకు చెందిన సాంబశివుడిని, రాములును హత్య చేశారని, అలాగే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బెదిరించారని ఎంపీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అలాంటప్పుడు నయీం బాధితులు ఎవరో తేలుతుందన్నారు. గూండాలను పెంచి పోషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. చీఫ్ రాజకీయాల కోసం కోమటిరెడ్డి బురద జల్లుతున్నారన్నారు. నలుగురు సీఎంలు చేయలేని పని మా ప్రభుత్వం చేసిందన్నారు.
పిట్టకూతలు మానకపోతే తీవ్ర పరిణామాలు అని గాదరి కిషోర్ హెచ్చరించారు. అనుమానాలు, ఆధారాలు ఉంటే సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులకు ఇవ్వాలన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే అట్రాసిటీ కేసు పెడతామన్నారు. పదవి కోల్పోతే తట్టుకోలేక డబ్బులు పెట్టి ఎమ్మెల్సీ అయ్యారన్నారు.