హుజూరాబాద్ గడ్డ .. టీఆర్ఎస్ అడ్డా .. ఈటలపై టీఆర్ఎస్ నేతల వాగ్బాణాలు
నిన్న మొన్నటివరకు టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పని చేసి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ పై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హుజురాబాద్ గడ్డ టిఆర్ఎస్ పార్టీ అడ్డ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేసుల నుండి తప్పించుకోవటానికే ఆయన బీజేపీలో చేరారని విమర్శిస్తున్నారు.
ఈటెల టార్గెట్ గా కోవర్ట్ ఆపరేషన్ ? హుజూరాబాద్ లో షాక్ ఇచ్చేలా సీఎం కేసీఆర్ అపర చాణిక్యం !!
ఎవరెన్ని ఎత్తులు వేసినా టీఆర్ఎస్ ను ఏమీ చెయ్యలేరు : చల్లా ధర్మా రెడ్డ్డి
కమలాపూర్ మండలంలోని అంబాలలో తమ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఈటల రాజేందర్ ను నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ టిఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరు అంటూ పేర్కొన్నారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పై నియోజకవర్గ ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని చెప్పిన చల్లా ధర్మారెడ్డి, ఈసారి ఎన్నికలలో ఈటల ను ప్రజలు ఓడించి తీరుతారని పేర్కొన్నారు.
ఆరు సార్లు గెలిచినా ఆయన చేసిందేమీ లేదు
అంతేకాదు ఈటల రాజేందర్ ఆరు సార్లు గెలిచానని గొప్పలు చెప్పుకుంటున్నారని,అయితే నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ చేస్తుంది ఆత్మగౌరవ పోరాటం కాదని అస్తిత్వ పోరాటం అంటూ మండిపడ్డారు.అంతేకాదు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని చల్లా ధర్మారెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈటల పార్టీ మారారని నిప్పులు చెరిగారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్తారు : గంగుల కమలాకర్
ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఈటల రాజేందర్ పై నిప్పులు చెరుగుతున్నారు గంగుల కమలాకర్. టిఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నానికి ఈటల కుట్ర చేశారని, సీఎం కుర్చీ కోసం ఈటల రాజకీయాలు చేశాడని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఈటల రాజేందర్ కు తగిన రీతిలో బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు. ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని పేర్కొన్న ఆయన, ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో చకచకా పావులు కదుపుతూ బిజీ అయ్యారు గంగుల కమలాకర్ .