డికె అరుణకు చిక్కులు: 'ఎవరి వల్ల ఇలా ఎదిగారో వారిపైనే తీవ్ర వ్యాఖ్య'
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణా రావు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ చిక్కుల్లో పడ్డారు! ఆమె పైన సోమవారం నాడు అడ్వోకేట్ జేఏసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తీరు పైన జేఏసీ మండిపడింది.
జూపల్లి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలతో ఎన్నుకోబడి, మంత్రి హోదాలో కొనసాగుతున్న జూపల్లి పైన ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. డీకే అరుణ అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం ఆమె గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ... జూపల్లిని జూలో పిల్లిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. జూపల్లి జూలో పిల్లి అని, ఆయన వ్యాఖ్యలకు తాను స్పందించనని చెప్పారు. వ్యక్తిగత అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే జూపల్లికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు.
జూపల్లి వల్లే ఎదిగిన డికె అరుణ: టిఆర్ఎస్
మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్యే డీకే అరుణ వ్యక్తిగత విమర్శలుచేయడం సరికాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వేంకటేశ్వర రెడ్డి అన్నారు. మంత్రి జూపల్లి పెట్టిన రాజకీయ భిక్షతో ఈ స్థాయికి చేరుకున్న అరుణ మాట్లాడటానికి ముందు ఒక్కసారి గత చరిత్రను గుర్తుచేసుకోవాలన్నారు.
ఇంకోసారి అహంకారం, గర్వంతో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. మల్డకల్, గట్టు మండలాలు జనరల్ స్థానాలైనా అక్కడ నిలబడకుండా జూపల్లి కృష్ణారావును ప్రాధేయపడితే పాన్గల్ మండల జెడ్పీటీసీగా ఆమెను గెలిపించారన్నారు.
తన సోదరిగా భావించి మంత్రి జూపల్లి రాజకీయ భిక్ష పెడితే ఈ స్థాయికి చేరుకున్న డీకే అరుణ.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండటానికి బదులు ఆమె చేసిన వ్యక్తిగత విమర్శలు చూస్తుంటే నవ్వు వస్తోందన్నారు. మరోసారి ఇలాగే మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు.
రాజకీయాల కోసం సొంత తమ్ముడిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. నాకు, చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని, జెడ్పీ సమావేశంలో ఆనాడు అనుకోకుండా జరిగిన ఘటన తప్ప మరేమీ కాదని గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవీత్యాగం చేసిన వ్యక్తి జూపల్లి అన్నారు.