టిఆర్ఎస్ గెలిచినా... కీలక నేతల వారసులు ఓడారు, కాంగ్రెస్ ఇద్దరు 'మేయర్లు' ఔట్!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పలువురు ప్రముఖుల వారసులకు చుక్కెదురైంది. ఫలితాల్లో టిఆర్ఎస్ దూసుకుపోతుంటే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తనయుడు మాత్రం ఓటమి పాలయ్యారు. అలాగే కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ సైతం పరాజయం పాలయ్యారు.
కాంగ్రెస్ తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్న విక్రమ్ గౌడ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మొదటిసారిగా మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. అయినా ఓడిపోయింది.
మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి ఓటమి చవిచూశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కార్తీక రెడ్డి నగర మేయర్గా వ్యవహరించారు.
టిడిపి గ్రేటర్ అధ్యక్షులు మాగంటి గోపినాథ్కు గట్టి షాక్ తగిలింది. తన నియోజకవర్గంలో కూడా ఆయన అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. బంగారు లక్ష్మణ్ మనమరాలు స్రవంతి, ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి కోడలు అనితా రెడ్డి, ఆలె నరేంద్ర భార్య లలిత వెనుకంజలో ఓడిపోయారు.