బురద జల్లొద్దు: పొన్నంపై పల్లా, కాకిగోలన్న సుమన్
హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ పొన్నం ప్రభాకర్పై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అనవసర ఆరోపణలతో తమపై బురద జల్లొద్దని హెచ్చరించారు. ఆధారాలుంటే ఏసిబికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ ఆధారాలను ఏసిబికి, కోర్టులకు ఇవ్వకుంటే మీడియాకైనా ఇవ్వాలని అన్నారు. పొన్నంతో బహిరంగ చర్చ సిద్ధమేనని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
పొన్నంది కాకిగోల: ఎంపి సుమన్
మీడియాలో సంచలనంగా మారేందుకే విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆధారాలులేని ఆరోపణలు చేస్తున్నారని టిఆర్ఎస్ నేతలు విమర్శించారు. జగదీశ్రెడ్డిపై ఆరోపణలకు తనవద్ద ఆధారాలున్నాయని చెప్పి ఎందుకు బయటపెట్టడంలేదని టిఆర్ఎస్ ఎంపీలు బాల్కసుమన్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు బీ వెంకట్రావ్, భానుప్రసాద్ ప్రశ్నించారు. పొన్నంది ఓ కాకిగోల అని ఎద్దేవా చేశారు.
టిఆర్ఎస్ఎల్పీలో వారు మాట్లాడుతూ.. ‘జగదీశ్రెడ్డిపై ఆరోపణలకు ఆధారాలు చూపుతాననిచెప్పి దాదాపు పది రోజులైంది. ఆధారాలు ఎటుపోయాయి? కాకి ఎత్తుకు పోయిందా? కొంగ ఎత్తుకు పోయిందా? నిజంగా మీ వద్ద ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వకపోవటం చట్టరిత్యా నేరం కాదా? నీపై ఏ కేసు పెట్టాలి. ఊరికే లేచిలేచి మాట్లాడటం.. ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి' పొన్నంకు సూచించారు.
అంతేకానీ మీడియాలో సంచనాలకోసం ఏదో మాట్లాడటం మంచిది కాదని హితవుపలికారు. అన్నివర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి కొందరికి కళ్లు మండుతున్నాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో షబ్బీర్ అలీ విద్యుత్తుశాఖ మంత్రిగా వైయస్ రాజశేఖర్రెడ్డి పక్కన ఉండి.. మిగతా విద్యుత్తు పనులు మరిచిపోయారని మండిపడ్డారు.
తట్టెడు బొగ్గు దొరకని సీమాంధ్రలో ఇన్ని థర్మల్ ప్రాజెక్టులు ఉండటానికి షబ్బీర్ అలీయే కారణమని విమర్శించారు. పదవుల కోసం పేపర్లు, టీవీల కోసం ఫర్మానాలు జారీ చేస్తున్నారని, 101 హామీలు కాదు.. కాంగ్రెస్పై లక్షా ఒకటి హామీల ఫర్మానా విడుదల చేస్తామని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో జీరో సీట్లు వచ్చినట్లే, తెలంగాణలో కూడా రాబోతున్నదన్నారు. సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వంపై చౌకబారు విమర్శలుచేస్తే ఊరుకోమని హెచ్చరించారు.