టిడిపిపై రాజద్రోహం కేసు పెట్టాలి: కర్నె, రసమయి
హైదరాబాద్: అసెంబ్లీలో జాతీయ గీతానికి అడ్డుపడి తెలుగుదేశం సభ్యులు దేశద్రోహానికి పాల్పడ్డారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సాంసృతిక సారధి అధ్యక్షుడు రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు అసెంబ్లీలో దుర్మార్గంగా వ్యవహరించాయని వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ను అవమానపర్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో ఉండటానికి అనర్హులని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. టిడిపిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. టిడిపి సభ్యులు సభకు క్షమాపణ చెప్పాలని, ఏపి సిఎం చంద్రబాబే పార్టీ ఫిరాయింపుదారుడని రసమయి బాలకిషన్ ఆరోపించారు. టిడిపి సభ్యులను సస్పెండ్ చేసి రాజద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
అమరుల త్యాగఫలమే: నాయిని
అమరుల త్యాగాల ఫలితాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పునరుద్ఘాటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముందుగా టిఆర్ఎస్ మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్కు వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ.. అమరుల త్యాగాలను ప్రభుత్వం మరువబోదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కు న్యాయం చేయడమే తమ బాధ్యత అని మరోసారి స్పష్టం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని అన్నారు.
ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: కెటిఆర్
ప్రజలకిచ్చిన హామీలన్నింటిని తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి కెటి రామారావు మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తుందని..బంగారు తెలంగాణ కోసం సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడమే తమ బాధ్యత అని తెలిపారు.