విదేశీ ఏజెంట్గా మారిన కంచ ఐలయ్య, సామాజిక ఉగ్రవాదిలా: టిఆర్ఎస్ ఆగ్రహం
'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకం రాసిన రచయిత కంచ ఐలయ్య పైన టిఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన విదేశీ ఏజెంట్లా మారారని దుమ్మెత్తిపోశారు.
హైదరాబాద్: 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకం రాసిన రచయిత కంచ ఐలయ్య పైన టిఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన విదేశీ ఏజెంట్లా మారారని దుమ్మెత్తిపోశారు.
టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, బిగాల గణేష్ గుప్తాలు ఆదివారం ఉదయం మాట్లాడారు. పచ్చగా ఉన్న తెలంగాణలో ప్రజల మధ్య కంచె చిచ్చు పెడుతున్నారన్నారు.
కంచ ఐలయ్య సామాజిక ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన మేధావి కాదని, ప్రశాంతంగా ఉంటూ, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న రాష్ట్రంలో లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారన్నారు.
'కోమట్లు' పుస్తకంపై బాబు సీరియస్, నిషేధం దిశగా?,టైటిల్ మార్చుతానని కంచ ఐలయ్య
కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేలా పుస్తకాలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన తన పుస్తకాన్ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సమస్యకు సామరస్యంగా ముగింపు పలికితే బాగుంటుందన్నారు. ఈ మేరకు ఐలయ్యనే వైశ్య సంఘాల ప్రతినిధులతో మాట్లాడాలని తెలిపారు. రాసేందుకు ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు.
తనకు ప్రాణహాని ఉందంటూ కంచ ఐలయ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని గణేష్ గుప్తా అన్నారు. ఆయన ఓ విదేశీ ఏజంట్లా మారిపోయారని ఆరోపించారు.