దౌర్జన్యాలు, సెటిల్మెంట్లకు కేరాఫ్ అడ్రస్: కొండా దంపతులపై విరుచుకుపడ్డ టీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోపాటు పార్టీపై విమర్శలు గుప్పించిన కొండా సురేఖ దంపతులపై టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. కొండా సురేఖ దంపతులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని టీఆర్ఎస్ నేత గుండు సుధారాణి విమర్శించారు.
కేటీఆర్ కోసం కేసీఆర్ పావులు, హరీశ్కు అన్యాయం: సురేఖ ఫైర్, 'వ్యాపారిగా కవిత, డీఎస్ తప్పేంటి?'
Recommended Video
ఉద్యమకారులపై దాడులు చేయించిన చరిత్ర నీది..
వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు అంతా గమనిస్తున్నారని సుధారాణి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని, ఉద్యమకారులపై దాడులు జరిపించిన చరిత్ర కొండా దంపతులదని మండిపడ్డారు. టీఆర్ఎస్లో వర్గాలు ఉన్నాయని సురేఖ అంటున్నారని, అలాంటి గ్రూపులు ఏమీ లేవని సుధారాణి స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో కేసీఆర్దే తుది నిర్ణయమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు కొండా దంపతులని గుండు సుధారాణి ఎద్దేవా చేశారు.
కేసీఆర్కు అదే భయం! నాతో ఇలా.. ఎర్రబెల్లితో అలా ఎందుకు?: నిప్పులు చెరిగిన సురేఖ
కొండా దంపతల నుంచి విముక్తి..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆరే తమ అధినేత అని బస్వరాజు సారయ్య వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు. కొండ దంపతుల పాలన నుంచి వరంగల్ వాసులు విముక్తి పొందారని ఎద్దేవా చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఆత్మగౌరవం అనే మాటకు అర్హతలేని వారు కొండా దంపతులని టీఆర్ఎస్ నాయకుడు బస్వరాజ్ సారయ్య విమర్శించారు. కొండా దంపతులు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై నియోజకవర్గంలో తిరగలేదన్నారు. కొండా సురేఖ నేతృత్వంలో ఏక్కరు కూడా బాగుపడలేదన్నారు.
కేటీఆర్, హరీశ్కు గ్రూపులు లేవు.. కేసీఆర్ పునర్జన్మిచ్చారు..
గతంలో టీడీపీలో ఉండి తుపాకీతో కుక్కను కాల్చి సర్పంచ్ అయిన వ్యక్తి కొండా మురళి అని, అలాంటి వారు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని విడ్డూరంగా ఉందన్నారు. కొండా మురళి డబ్బులు పెట్టి, బెదిరించి ఎమ్మెల్సీ అయ్యాడని ఆరోపించారు. కొండా దంపతులకు రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెడితే, కేసీఆర్ పునర్జన్మ ఇచ్చారన్నారు. గతంలో ఈ మాట సురేఖనే అన్నారని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ను విమర్శించడంసబబు కాదన్నారు. తెలంగాణ అని పలికే అర్హత కొండా దంపతులకు లేదన్నారు. కొండా దంపతులను వరంగల్ నుంచి కాదు కదా తెలంగాణ నుంచే తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, కేటీఆర్ వేరు వేరు గ్రూపులు కాదన్నారు. కాంగ్రెస్లోలాగా టీఆర్ఎస్లో ఎలాంటి గ్రూపులు లేవని సారయ్య పేర్కొన్నారు.
సెటిల్మెంట్లకు కేరాఫ్ కొండా దంపతులు
కొండా సురేఖ దంపతులపై తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొండా దంపతులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లకు కొండా దంపతులు కేరాఫ్ అడ్రస్ అని ఆయన పేర్కొన్నారు. కొండా దంపతులకు టీఆర్ఎస్ రాజకీయంగా పునర్జన్మనిచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో కేటీఆర్పై ఎన్నో కేసులు పెట్టారు. కేటీఆర్పై కొండా దంపతులు విమర్శలు చేయడం సరికాదన్నారు. కొండా కుటుంబానికి టీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వకపోవడంతో వరంగల్ ఈస్ట్లో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని వినయ్ భాస్కర్ తెలిపారు.
రాజకీయ సమాధే..
కేసీఆర్ వల్లే కొండా సురేఖ దంపతులకు రాజకీయ పునర్జన్మ లభించిందని టీఆర్ఎస్ సీనియర్ నేత నాగూర్ల వెంకన్న పేర్కొన్నారు. కేసీఆర్ బొమ్మతోనే మీకు ఎన్నికల్లో అంత మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. మురళికి దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఏకగ్రీవంగా గెలవాలి అని సవాల్ విసిరారు. ఇది ఇలావుంటే, ప్రపంచంలో ఆత్మగౌరవం అనే మాటకు అర్హత లేని వారు ఎవరైనా ఉన్నారంటే అది కొండా దంపతులు మాత్రమేనని వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఎద్దేవా చేశారు. దొర పాలన చేసేది సురేఖ కుటుంబమేనని విమర్శించారు. ఈ కాలం పిల్లలకు దొర అంటే మీ భర్తనే చూపించాలని ఎద్దేవా చేశారు. కొండా సురేఖ నాన్న చనిపోతే ఆమె భర్తే రాలేదని, కేసీఆర్ ఎలా వస్తారని ప్రశ్నించారు. 2019వరకూ కొండా దంపతులు రాజకీయ సమాధి కాబోతున్నారని వ్యాఖ్యానించారు. కొండా దంపతులకు నిజంగా రాజకీయ బలం ఉంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటి చేయాలని సవాల్ చేశారు.