అవి రైతు సంక్షేమానికేనా?: గులాబీ శ్రేణుల ఆరాటం ప్లస్ ఒత్తిళ్లు
రైతు సంక్షేమం కోసమే ‘రైతు సమన్వయ సమితి’ ఏర్పాటు చేస్తున్నట్లు ఘనంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అధికార ‘టీఆర్ఎస్’ పార్టీలోనే ముసలం పుట్టేందుకు కారణమైంది.’
హైదరాబాద్: రైతు సంక్షేమం కోసమే 'రైతు సమన్వయ సమితి' ఏర్పాటు చేస్తున్నట్లు ఘనంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అధికార 'టీఆర్ఎస్' పార్టీలోనే ముసలం పుట్టేందుకు కారణమైంది.' ఈ సమన్వయ కమిటీల్లోకి సభ్యుల ఎంపిక ప్రక్రియ చినికి..చినికి గాలివాన అయినట్లు స్వంత పార్టీలోనే వివాదాలకు దారి తీసింది.
చోటు దక్కని నాయకులు.. ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరించాలని కూడా తీర్మానాలు సాగించినట్లు విమర్శలు ఉన్నాయి. గతంలో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో 'ఆదర్శ రైతు' తరహాలోనే తాజాగా రైతు సమన్వయ సమితిల్లో చోటు కల్పించాలని టీఆర్ఎస్ శ్రేణుల ఒత్తిడి తెస్తున్నాయి. కేవలం రైతు సంక్షేమానికే ఈ కమిటీలను ఏర్పాటు చేస్తే వాటిల్లో సభ్యత్వం కోసం గులాబీ శ్రేణులు ఆరాటం చూపడం ఏమిటని ప్రజలు విస్తూ పోతున్నారు.
ఉదాహరణకు కుమ్రంభీమ్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గ్రామ సమన్వయ కమిటీల ఎంపికలో సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదేశాలను భేఖాతరు చేసిన వెలుగులోకి వచ్చింది. రైతులతో సమావేశం ఏర్పాటు చేయకుండానే రైతుల పేర్లను ఎంపిక చేయడంతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్తో ఎంపీపీ జాదవ్ మీరాబాయి వాదనకు దిగారు.
మండల కేంద్రంలోనే నలుగురు పార్టీ కార్యకర్తలు రైతుల పేర్లు నమోదు చేశారని, ఒక ఇంటి నుంచి ఇద్దరి నుంచి నలుగురిని ఎంపిక చేయడంతో గ్రామాల్లో ప్రభుత్వానికి, పార్టీని చెడ్డగా మాట్లాడుతున్నారని అన్నారు. దీంతో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ మండల పరిషత్ అధికారి (ఎంపీడీఓ) ను బదిలీ చేయించలేదని త పై ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు.
ఆదర్శ రైతుల మాదిరే ఇలా సమన్వయ సమితుల్లోనూ.
తన గురించి మాట్లాడవద్దని చూపుడు వేలుతో ఎంపీపీని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ అవగాహన సదస్సుకు హాజరైన ధనోర(బి) పంచాయతీ సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ మాట్లాడుతూ తనకే కమిటీ ఏర్పాటుపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆవేదనతో అన్నారు. ధనోర(బి) గ్రామంలో ఒకే ఇంటి నుంచి ఇద్దరి చొప్పున కమిటీలో తీసుకున్నారని, తన పంచాయతీలో 378 మంది రైతులు ఉన్నారని, వీరిలో 14 మంది రైతులు అర్హులు లేరని, ఒక ఇంటి నుంచి భార్యభర్తలు, తల్లీ కొడుకులను ఎలా తీసుకున్నారని సర్పంచ్ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదర్శ రైతులను ఇష్టం వచ్చిన వారిని నియమించినట్లే రైతు సమన్వయ సమితిల్లో తమ పార్టీ వారికి స్థానం కల్పించామని గొప్పగా చెప్పుకున్నారు.
అసంపూర్తి కమిటీల జాబితాలు వెనుకకు...
అర్బన్ మినహా కరీంనగర్ జిల్లాలోని 15 మండలాల్లో 205 రెవెన్యూ గ్రామాలకు 3075 మంది సభ్యులను నియమించాల్సి ఉండగా కేవలం 765 మందిని మాత్రమే నియమించారు. పలుచోట్ల పూర్తయినా జాబితాలో కోఆర్డినేటర్ ఎవరో పేర్కొనకపోవడం, రైతులు కాని వారి పేర్లు ఉండటంతో జాబితాలను తిప్పిపంపుతున్నారు అధికారులు. 15 మండలాలకు కేవలం 4 మండలాల్లో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, చిగురుమామిడి, సైదాపూర్లలో మాత్రమే ప్రక్రియ పూర్తయింది. మరో 11 మండలాల్లో గ్రామ, మండల సమితుల కోసం అనర్హులను పేర్లను పంపుతుండటంతో వ్యవసాయ శాఖ తిప్పి పంపుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యవహరిస్తుండగా ఎమ్మెల్యేలకు తలనొప్పిగా తయారైంది. అవగాహన ఉన్న రైతులనే ఎంపిక చేయాలని భావిస్తున్నా పైరవీల గోల వీడని నీడలా వెంటాడుతోందని ఓ ఎమ్మెల్యే వివరించారు.
ఇలా ఆధిపత్యం కోసం నేతల పట్టు
మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్త మంగళవారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. మక్తల్ మండలం మంథన్గోడ్కు చెందిన కృష్ణ ముదిరాజ్ తనకు రైతు సమన్వయ సమితిలో సభ్యుడిగా చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి వద్దకెళ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే కమిటీలు పూర్తయ్యాయని ఎమ్మెల్యే సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన కృష్ణ సెల్ టవర్ ఎక్కాడు.. టవర్పై నుంచి అతణ్ని కిందికి దింపడానికి పార్టీ నాయకులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అక్కడకు చేరుకొని ఫోన్లో మాట్లాడి హామీ ఇవ్వడంతో కిందకు దిగి వచ్చాడు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఎవరికి వారు తమ వర్గం వారికి ప్రాధాన్యం కల్పించాలని పట్టు బడుతున్నారు.
ఇందూరులో పేర్లు బయటకు రాని కమిటీలు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమన్వయ కమిటీల్లో చోటు కోసం టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవితలతో పైరవీలు సాగిస్తున్నాయి. అయితే పలుచోట్ల తమకు చోటు కల్పించకపోవడంతో నేతల్లోనే అసంత్రుప్తి బలపడిందని సమాచారం. జిల్లాలో గ్రామ సభల ద్వారా పారదర్శకంగా జరుగాల్సిన సభ్యుల ఎంపిక ప్రక్రియ లోలోపల జాబితాలు రూపుదిద్దుకుంటున్నాయి. దీనిపై ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పై విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా 439 రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ పలుచోట్ల వాటి పేర్లు బయటకు పొక్కలేదు. వీటిని బహిర్గతం చేస్తే తమకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని కొందరు, ఫలానా వారు అనర్హులని అభ్యంతరాలు వ్యక్తమవుతాయని, ఇలా పలు కారణాలతో వివాదాలు చెలరేగుతాయని భావించి జాబితాలను బయట పెట్టడం లేదు. ఏర్గట్ల, పాలెం, మాక్లూరు, ఒడ్యాట్పల్లి, అంకాపూర్ తదితర గ్రామాల్లో సభ్యుల పేర్లు వెలుగు చూడటంతో ఆందోళనలు చెలరేగాయి.
ప్రభుత్వ కార్యక్రమాల బహిష్కరణకు ఇలా
ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీలు బలంగా ఉన్న బాల్కొండ, ఆర్మూరు నియోజకవర్గాలతో పాటు జక్రాన్పల్లి మండలాల్లో రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ వ్యవహారం చివరకు సమితుల సమావేశాన్ని బహిష్కరించాలని తీర్మానం చేసే స్థాయికి చేరింది. మాక్లూరు, వడ్యాట్పల్లి గ్రామాల్లో భూములు లేని వారిని, ఊళ్లో లేని వ్యక్తులతో సమితుల్లో నియమించారని వివాదం చెలరేగింది.మాక్లూరు మండలం వల్లభాపూర్ స్థానిక నాయకుల మధ్య వివాదం తలెత్తడంతో సమితి ఎంపిక కొలిక్కిరాలేదు.
మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన సమితిలో తమకు ప్రాధాన్యం ఎందుకు కల్పించలేదన్న స్థానిక ఇద్దరు ప్రజాప్రతినిధులను ఇద్దరిని గ్రామ కమిటీ పిలిపించి మాట్లాడింది. తాము సూచించే నలుగురి పేర్లను జాబితాలో చేర్చాలని కోరింది. ఇప్పటికే సమితి ఎంపిక పూర్తయిందని, మార్పు చేర్పులకు అవకాశం లేదని సదరు నాయకులు తేల్చి చెప్పారు. దీంతో రైతు సమన్వయ సమితి నిర్వహించే కార్యక్రమాలకు సహకరించకూడదని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది.
ఎమ్మెల్యే యాదయ్య కాళ్లు పట్టుకున్న ఉపసర్పంచ్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల రైతు సమన్వయ కమిటీ సదస్సు బుధవారం పోలీసుల బందోబస్తు మధ్య సాగింది. సమావేశానికి ఆరంభంలోనే ముందస్తు అరెస్టులు కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంగర గ్రామ సర్పంచ్ శేఖర్ను సమావేశ ప్రాంగణం నుంచే అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ అనుచరులనూ పోలీసులు అరెస్టు చేశారు. యాచారంలో జరిగిన ఘటన పునరావృతమవుతుందని భావించిన పోలీసులు ఈ అరెస్టు పర్వాన్ని కొనసాగించారు. కొంగర సర్పంచ్ శేఖర్ను అక్రమ అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి ఖండించారు. పోలీస్స్టేషన్లో ఉన్న సర్పంచ్ను ఆయన పరామర్శించారు. 'కాల్మొక్తమ్ సార్. మేమూ టీఆర్ఎస్ పార్టీ నాయకులమే.
సమన్వయ కమిటీలో మా పేర్లు చేర్చండి' అంటూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కేపల్లి ఉప సర్పంచ్ మహేందర్రెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్య కాళ్లు పట్టుకున్నారు. ఆయన కారు ముందు గ్రామస్తులు బైటాయించి బుధవారం ఆందోళన చేపట్టారు.'మమ్ముల్ని కాదని వేరే వారికి స్థానం కల్పించవద్దు. టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని బతుకుతున్నం. పార్టీకోసం ప్రాణాలైనా ఇస్తాం. మాకు అన్యాయం చేయొద్దు. స్థానం కల్పించండి' అంటూ ఎమ్మెల్యేని వేడుకున్నారు. 'భూములు లేని వారిని కమిటీల్లో చేర్చి మాకు అన్యాయం చేస్తున్నారు. ఇది సరిగాదు' అని ప్రాధేయపడ్డారు. కమిటీలో స్థానం కల్పించాలని కోరితే పార్టీలోని కొంత మంది నాయకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వాపోయారు.
రాజేంద్ర నగర్లో రైతుల కొరత
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని నాలుగు గ్రామాల్లో సరిపడా రైతులు లేకపోవడంతో రైతు సమన్వయసమితులు ఏర్పాటు కాలేదు. గ్రామస్థాయి రైతు సమన్వయ సమితుల్లో 15 మంది సభ్యులను ఎంపిక చేయాల్సి ఉండగా, హైదర్షా కోటలో ఇద్దరు, మణికొండలో నలుగురు, పీరం చెరువులో ఆరుగురు, నార్సింగ్లో ఆరుగురు రైతులు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామాల్లో రైతుల సంఖ్య తక్కువగా ఉండడంతో మండల కమిటీకే ఈ బాధ్యత అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.యాచారం మండలంలో రైతు సమన్వయ సమితి సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాకముందే మండల నేతల మధ్య మాటమాటా పెరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఇరువర్గాలను పోలీసులు సమావేశం నుంచి బయటకు పంపేశారు.
ఎమ్మెల్యే వచ్చాక మరోసారి ఇరువర్గాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ఎంపీపీ రమావత్జ్యోతిని ఎమ్మెల్యే కించపర్చారంటూ మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి సమన్వయకర్త పోస్టు కోసం టీఆర్ఎస్ నేతలు పీ జైపాల్ రెడ్డి, ఎం వెంకట్రామిరెడ్డి పోటీ పడుతున్నారు. డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు జైపాల్ రెడ్డి అందోలు మండలం డాకూర్ గ్రామ రైతు సమన్వయ సమితిలో పేరు నమోదు చేసుకున్నారు.
నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డీ సమీప బంధువు ఎం. వెంకట్రామిరెడ్డి కూడా ఈ పదవి కోసం పోటీ పడ్తున్నారు. కానీ ఆయన తన సొంత గ్రామం బీబీపేట గ్రామ సమితిలో పేరు నమోదు చేసుకోకపోవడం గమనార్హం. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ జాబితా అయితే ఖరారు చేశారు కానీ నిబంధనలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కమిటీల్లో సభ్యులుగా నియమితులైన వారికి నిజంగా భూములు ఉన్నాయా? లేదా? అన్న అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారని సమాచారం.