కేసీఆర్ని అంతమాట అంటావా: కోదండకు 'తెలంగాణ' షాకిచ్చిన టిఆర్ఎస్
హైదరాబాద్: రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదని విమర్శించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం పైన తెరాస నేతలు ఆగ్రహోద్రులవుతున్నారు. ఆయన పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని దుయ్యబడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఇక గద్దె దిగాలన్న కోదండరామ్ వ్యాఖ్యలను మంత్రి ఈటెల రాజేందర్ ఖండించారు. రాష్ట్రంలోని రాజకీయ నేతలు, మేధావులు కేసీఆర్ ప్రభుత్వ పాలనను మెచ్చుకుంటుంటే, కోదండరామ్ విమర్శించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ అన్ని పార్టీలనూ ఏకం చేశారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ పుట్టకముందే ప్రత్యేక తెలంగాణ ప్రకటన వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి, కోదండకు షాకిచ్చారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు. రూ.17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామన్నారు.
కోదండరాం కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని తెరాస ఎంపీ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ప్రపంచమంతా కేసీఆర్ను కీర్తిస్తుంటే ఆయన మాత్రం తప్పుబడుతున్నారన్నారు. కోదండరాం కుబుసం విడిచిన పాము అని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జేఏసీ ఉనికిలో లేదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కొందరు వ్యక్తులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ పేరు చెప్పుకుని సీఎం కేసీఆర్పై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసలు కోదండరాం ఏ జేఏసీకి ఛైర్మనో చెప్పాలని ప్రశ్నించారు.
పొలిటికల్ జేఏసీ లక్ష్యం ఏమిటో కోదండరాం చెప్పాలన్నారు. ఇప్పుడు ఉ్నన జేఏసీ ఎప్పుడు ఏర్పాటయిందని, దాని కార్యవర్గమేంటో చెప్పాలన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా అన్ని పార్టీలను కలుపుకుని కేసీఆర్ జేఏసీని ఏర్పాటు చేశారన్నారు.
ఓ జాయింట్ కమిటీని వేసి దానికి కోదండరాంను ఛైర్మన్ను చేశారని వివరించారు. జేఏసీలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలు ఉండేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తర్వాత అన్ని పార్టీలు విడిపోయాయని, ప్రస్తుతం రాష్ట్రంలో తెరాసయేతర పార్టీల పరిస్థితి ఏమిటో అందరికి తెలుసన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తితో తమ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు తమనే గెలిపిస్తున్నారన్నారు. ప్రజలు ఆదరిస్తున్నారనడానికి ఇది నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రజలే ఇస్తారని చెప్పారు. తమతో కలిసి రావాలని కోదండరాంను కోరినా రాలేదన్నారు. జేఏసీ ముసుగులో ప్రభుత్వంపై కోదండ దాడిని ఖండిస్తున్నామన్నారు.
కోదండరాంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో వారు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ను ఉద్దేశించి.. చేతకాకుంటే తప్పుకోండని కోదండరాం వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
కోదండరాం ఇచ్చిన ప్రకటనకు ఆధారం ఏమిటన్నారు. కోదండరామ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడం దురదృష్టకరమన్నారు. పనికిరాని రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఏవరి ఒత్తిడికి తలొగ్గి కేసీఆర్ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు.
ప్రభుత్వ పాలనకు ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలే గీటు రాయి అని తెలిపారు. ఏ ఎన్నికలు జరిగినా తెరాసనే ప్రజలు గెలిపించారన్నారు. ప్రభుత్వ పాలన బాగుంది కాబట్టే టీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. ఉద్యమస్ఫూర్తితో ఎలాగైతో తెలంగాణ కోసం కొట్లాడమో అదే స్పూర్తితో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
అరవై ఏళ్లుగా కనిపించని కార్యక్రమాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? లేదా? అని ప్రశ్నించారు. ప్రజలంతా సంఘటితంగా తెలంగాణ సాధించుకున్నారు అని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.