సీఎస్ను కలిసిన ప్రీతిమీనా: వచ్చే ఎన్నికల్లో నాయక్ ఔట్?, ఆసక్తికరంగా మానుకోట రాజకీయం
హైదరాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ పట్ల కలెక్టర్ ప్రీతి మీనా ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినప్పటికీ.. ప్రీతి మీనా సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు తెలంగాణ సీఎస్(చీఫ్ సెక్రటరీ) ఎస్పీ సింగ్ను కలిసి మరోసారి ఎమ్మెల్యే ప్రవర్తనపై ఆమె ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీపీ ఆచార్య నేతృత్వంలో ప్రీతిమీనా సీఎస్ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన పట్ల వ్యవహరించిన తీరును సీఎస్ కు వివరించారు. కాగా, సీఎం హెచ్చరిక మేరకు శంకర్ నాయక్ గురువారం నాడు మీడియా ముఖంగా కలెక్టర్ ప్రీతిమీనాకు క్షమాపణలు తెలియజేశారు. ఆమె తన సోదరి లాంటిదని చెప్పారు.
కలెక్టర్ ప్రీతిపై నాకు వేరే ఉద్దేశ్యం లేదు, సారీ చెప్పాక: ఎమ్మెల్యే శంకర్
ఉద్దేశపూర్వకంగా తాను ఆమె తాకే ప్రయత్నం చేయలేదని,హరితహారం కార్యక్రమం ముగించుకుని వెళ్తున్న సందర్భంలో అనుకోకుండా అలా జరిగిందని ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం ఎమ్మెల్యే శంకర్ నాయక్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
శంకర్ నాయక్ అవుట్?:
ఈ నేపథ్యంలో మహబూబాద్ నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శంకర్ నాయక్పై మచ్చ పడటంతో.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వదన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కూతురు కవితను టీఆర్ఎస్ ఇన్ చార్జీగా నియమించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే టికెట్పై ఆశావహుల కన్ను:
ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీగా ఉన్న సీతారాం నాయక్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. వీరికి తోడు మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కూడా టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ తో వివాదంలో ఇరుక్కోవడంతో.. శంకర్ నాయక్ చాప్టర్ ఇక క్లోజేనని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.
కేసీఆర్ పై ఐఏఎస్ ల ఒత్తిడి:
ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్లతో వివాదంలో ఇరుక్కుంటున్న ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు రసమయి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు ఈమధ్య కాలంలో కలెక్టర్లతో వివాదంలో ఇరుక్కున్నారు. దీంతో ఐఏఎస్ ల సంఘం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగడాలపై గుర్రుగా ఉంది. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ పై వారు ఒత్తిడి పెంచారన్న ప్రచారం కూడా ఉంది.
ఎమ్మెల్యేలందరికీ హెచ్చరిక!:
ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉదంతం మిగతా ఎమ్మెల్యేలందరికి ఒక హెచ్చరికలా ఉపయోగపడుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ల విషయంలో గీత దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు ఆయన పంపించారు. దీంతో ఇకనుంచి ఉన్నతాధికారుల పట్ల ఎమ్మెల్యేలు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది.