విషాదం: చికిత్స పొందుతూ ఓదేలు అనుచరుడు గట్టయ్య మృతి
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామంటూ ప్రకటించిన కేసీఆర్ అదే సమయంలో పోటీలో నిలబడే వ్యక్తులను కూడా ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో కొంత అసంతృప్తులు బయటపడ్డారు. ముఖ్యంగా చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు స్థానంలో పెద్ద పల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్కు టికెట్ ఇవ్వడంతో హైడ్రామానే నడిచింది. ఈ క్రమంలోనే ఓదేలు మద్దతు దారులు బాల్కసుమన్ నిర్వహించిన ర్యాలీలో నిరసన తెలిపారు. నిరసన తెలిపే క్రమంలో గట్టయ్య అనే ఓదేలు మద్దతుదారుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గట్టయ్యను హైదరాబాద్లో మలక్పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
నిప్పంటించుకున్న ఓదేలు అనుచరుడు
గట్టయ్య కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆయన శరీరం 60శాతానికి పైగా కాలింది.లుత మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి, తర్వాత వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఇదే ఘటనలో జైనుద్దీన్, సుంకరి విమల, పి.నిఖిత, రాజేశ్వరి, జక్కుల గంగమణి, చేకూరి సత్యనారాయణరెడ్డి, జక్కుల వెంకటేశ్, తొగరి శ్రీనివాస్, భాస్కర్ల శ్రీకాంత్, ఎన్.శ్రీనివాస్, చుంచు రాజయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 9 మందిని హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించగా మిగిలినవారిని హైదరాబాద్లోని ఇతర ఆసుపత్రుల్లో చేర్పించారు.
బాల్క సుమన్కు ఇటీవల తెరాస పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. దీంతో సుమన్ మంచిర్యాల జిల్లా ఇందారంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు పలువురు తెరాస మహిళా కార్యకర్తలు హారతులు పట్టారు. ఈ సమయంలో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఆందోళన నెలకొంది. ఈ సమయంలో ఓదేలు అనుచరుడు గట్టయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటలను ఆర్పే సమయంలో మరికొందరు గాయపడ్డారు. గట్టయను ఆసుపత్రిలో చేర్పించారు.