ప్రత్యేక రాయలసీమకు వైఎస్ షర్మిల -ఒకటికి కోటి బాణాలు -కేసీఆర్ బర్త్డేలో గంగుల సంచలనం
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోన్న వైఎస్ షర్మిలపై ఇక్కడి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడిని ముమ్మరం చేసింది. ప్రగతిభవన్ ఆదేశాల మేరకు పార్టీ అధికారికంగా స్పందించకున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆప్తులుగా ముద్రమడిన కీలక మంత్రులు షర్మిలపై వరుస బాణాలు వదులుతున్నారు. షర్మిల ప్రాంతీయతపై తొలి నుంచీ విమర్శలు చేస్తోన్న టీఆర్ఎస్.. ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే..
ys sharmila అసాధారణ స్పీడు -యుద్ధ నౌక గద్దర్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ -సలహాదారులూ ఖరారు!
సారు పుట్టినరోజు.. షర్మిల జోరు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రమంతటా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో ముగినిపోయిన సమయంలోనే.. హైదరాబాద్ వేదికగా వైఎస్ షర్మిల తన కొత్త పార్టీ పనుల్ని వేగవంతం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన విప్లవ కవి గద్దర్, మోటివేషనల్ స్పీకర్ గా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన బ్రదర్ షఫీ, రాష్ట్రానికే చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ మాజీ అధికారులు, తెలంగాణ మాల, మాదిగ సంఘాల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్ లో షర్మిలతో భేటీ అయ్యారు. తెలంగాణ కోడలిగా ఇక్కడ పార్టీ పెట్టే హక్కు తనకుందంటూ ప్రయత్నాలను ముమ్మరం చేసిన షర్మిలకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి విమర్శలు తప్పడంలేదు. ప్రధానంగా..
మళ్లీ సంచలనం రేపిన మంత్రి గంగుల
తెలంగాణ నీళ్లు, కరెంటును దోచుకుపోవడానికే వైఎస్ షర్మిల పార్టీ పెడుతోందని, ముందుగా ఆమె, ఆ తర్వాత జగన్, చివరికి చంద్రబాబులు కూడా మళ్లీ తెలంగాణకు పీడలా చుట్టుకుంటారని, ప్రాజెక్టులను బద్దలు కొట్టిమరీ నీళ్లు ఎత్తుకెళతారంటూ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం సంచలనం ఆరోపణలు చేశారు. బుధవారం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కరీంనగర్ లోని ఐటీ టవర్లో పలువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన కమలాకర్.. మరోసారి షర్మిలపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అంశాన్ని గంగుల లేవనెత్తారు..
ప్రత్యేక రాయలసీమకు షర్మిల..
''జగన్న బాణంగా బీజేపీ వదిలిన వైఎస్ షర్మిల.. తెలంగాణ ప్రజలపైన పడకుండా ప్రత్యేక రాయలసీమకు వెళ్లిపోవాలి. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ రాయలసీమ సోదరులు ఉద్యమిస్తున్నారు. వాళ్లకు షర్మిల మద్దతుగా నిలబడాలి. తెలంగాణకు రావాలనుకుంటోన్న బాణాలు దయచేసి రాయలసీమ బిడ్డల కోసం పోరాడాలి. షర్మిల నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ ఏర్పాటయితే.. అటు సీమ బిడ్డలు, ఇటు తెలంగాణ బిడ్డలు సంతోషంగా ఉంటారు. కాబట్టి షర్మిల తన దిశను మార్చుకోవాలి'' అని మంత్రి గంగుల సలహా ఇచ్చారు. అంతేకాదు..
జగనన్నది ఒక బాణం.. ఇక్కడ కోటి..
''జగనన్న బాణం ఒక్కటి వస్తే.. ఇటు నుంచి కోట్లాది కేసీఆర్ బాణాలు రెడీగా ఉన్నాయి. ఎటు నుంచి ఏ బాణం వచ్చినా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కేసీఆర్ శ్రీరామరక్షలా ఎదురు నిల్చుంటాడు. కేసీఆర్ దెబ్బకు ఎన్ని బాణాలొచ్చినా తిరుగుముఖం పట్టక తప్పదు. సింగిల్ పార్టీగా టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేకనే జగనన్న బాణంగా షర్మిలను బీజేపీ వాళ్లే రంగంలోకి దింపారు. ఆమె కచ్చితంగా బీజేపీ సంధించిన జగనన్న బాణమే'' అని మంత్రి కమలాకర్ అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిగిన చాలా చోట్ల షర్మిల కొత్త పార్టీ అంశం హాట్ టాపిగ్ గా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా,
షర్మిల కోరేది, కేసీఆర్కు కావాల్సింది ఇదేనా?
ఇంకా కొత్త పార్టీ ప్రకటన రాకముందు నుంచే వైఎస్ షర్మిలను ఉద్దేశించి టీఆర్ఎస్ మంత్రులు పలు రకాలుగా విమర్శలు చేస్తుండటం, మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ మరో అడుగు ముందుకేసి, ప్రత్యేక రాయలసీమ ఉద్యమంలో షర్మిల పాల్గొనాలని కోరడం అనూహ్య పరిణామాలుగా మారాయి. షర్మిలపై మాట్లాడొద్దని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వెలువడినట్లు చెబుతున్నా, మంత్రులు మాత్రం యాంటీ షర్మిల కామెంట్లలో ఎక్కడా తగ్గట్లేదు. అధికార పార్టీ వాళ్లు ఎంతగా మాట్లాడితే, తన కొత్త పార్టీకి అంతగా లాభిస్తుందని షర్మిల కోరుతూ ఉండొచ్చు. అదే సమయంలో, బీజేపీ కంటే 'ఆంధ్రా విలన్' అయితే వచ్చే ఎన్నికల్లో ఈజీగా నెగ్గుకు రావొచ్చని కేసీఆర్ భావిస్తుండొచ్చు. మొత్తానికి టీఆర్ఎస్ మంత్రుల వ్యాఖ్యలు రెండు పక్షాలకూ మేలు చేసేలా ఉన్నాయన్నని కామెంట్లు వస్తున్నాయి.
వైఎస్ షర్మిలపై సంచలన ఆరోపణలు -బద్దలు కొట్టి ఎత్తుకెళతారన్న గంగుల -కేసీఆర్ వ్యూహం ఇదేనా?