కలెక్టర్ ప్రీతిపై నాకు వేరే ఉద్దేశ్యం లేదు, సారీ చెప్పాక: ఎమ్మెల్యే శంకర్
కలెక్టర్ ప్రీతి మీనాపై తనకు ఎలాంటి వేరే ఉద్దేశ్యం లేదని, ఆమె తనకు సోదరితో సమానమని తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ గురువారం అన్నారు.
మహబూబాబాద్: కలెక్టర్ ప్రీతి మీనాపై తనకు ఎలాంటి వేరే ఉద్దేశ్యం లేదని, ఆమె తనకు సోదరితో సమానమని తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ గురువారం అన్నారు.
పార్టీలోనే, ఇతర పార్టీ నుంచో కొందరు తనను కావాలనే టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోందని చెప్పారు. తాను ఎ తప్పు చేయకపోయినప్పటికీ, పార్టీ ఒత్తిడి మేరకు క్షమాపణ చెప్పానని, అయినా అర్ధరాత్రి నోటీసులు, అరెస్టులు ఏమిటన్నారు.
కలెక్టర్ విషయంలో మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అయినా ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీలు సూచించడంతో క్షమాపణ చెప్పానన్నారు. అయినా కేసులు ఎందుకు పెట్టారన్నారు.
కలెక్టర్ ప్రీతి మీనా చేయి తగిలిన విషయంలో ఏం జరుగుతుందో తనకు కూడా అర్థం కావడం లేదన్నారు. ఈ విషయం తనకు తొలుత తెలియదని, అధినేత ఫోన్ చేసి అడిగితే, కలెక్టర్ బాధపడిన విషయం తనకు తెలియదని, హరిత హారంలో కార్యక్రమంలో పబ్లిక్ ఉన్నారని, అప్పుడు అనుకోకుండా తాకవచ్చునని చెప్పారు.
నా చేయి తాకితే తాకి ఉండవచ్చు
అంతమంది జనాల్లో తన చేయి తాకితే తాకి ఉండవచ్చునని చెప్పానని శంకర్ నాయక్ అన్నారు. తనకు తెలియకుండా జరిగిందని క్షమాపణ కూడా చెప్పానని తెలిపారు. కలెక్టర్కు తనకు మధ్య గతంలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
ఏదో కుట్ర జరుగుతుందేమో
కలెక్టర్ వచ్చిన తర్వాత మూడు నాలుగుసార్లు తాను ఆమెతో మాట్లాడి ఉండవచ్చునని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే మాట్లాడానని చెప్పారు. తాను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అర్ధరాత్రి కేసు పెట్టడం చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు.
కేసీఆర్ కోసం ఏమైనా చేస్తా
తాను కేసీఆర్ కోసం, పార్టీ కోసం, తన నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేస్తానని చెప్పారు. తనకు ఈ పదవి ప్రజలు, భగవంతుడు ఇచ్చిన అవకాశమని చెప్పారు.
హైడ్రామా
నిన్న రాత్రి తాను క్షమాపణ చెప్పినప్పటి నుంచి, అర్ధరాత్రి ఫిర్యాదు, ఉదయం పోలీసు స్టేషన్కు వెళ్లే వరకు హైడ్రామా నడిచినట్లుగా తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. తన గురించి కేసీఆర్కు తెలుసునని, ఆయన చూసుకుంటారని చెప్పారు.