భారీ షాక్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు
న్యూఢిల్లీ: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు భారత పౌరసత్వం విషయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. ఆయన పౌరసత్వం రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
భారత పౌరసత్వం రద్దు
చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపింది.
ఎన్నిక చెల్లదంటూ..
కేంద్ర హోంశాఖ చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. కాగా, తప్పుడు ధృవపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేష్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆదిశ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు.
మోసపూరితంగా..
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తమ అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్కు కోర్టు సూచనలు చేసింది. దీనిపై పున:సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ చెన్నమనేని మోసపూరితంగా భారత పౌరత్వాన్ని పొందారని తేల్చింది. అనేక వాస్తవాలు దాచి తప్పుడు మార్గంలో పౌరసత్వం కలిగి ఉన్నారని గుర్తించింది. చెన్నమనేని భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని స్పష్టం చేసింది.
హైకోర్టులో తేల్చుకుంటా..
ఈ మేరకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన జర్మనీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ద్వంద్వ పౌరసత్వంపై ఆదిశ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కాగా, తన భారత పౌరసత్వం రద్దు చేయడం వాస్తవమేనని, పూర్తిస్థాయి కాపీ అందిన తర్వాత తాను స్పందిస్తానని చెన్నమనేని రమేష్ చెప్పారు. కేంద్ర హోంశాఖ నిర్ణయంపై హైకోర్టులో తేల్చుకుంటానని తెలిపారు.