ఆరోజు అసలేం జరిగింది.. కారులో ఎక్కడికి బయలుదేరారు.. మిస్టరీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి
పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం కరీంనగర్ జిల్లా అలుగునూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ కాలువలో శవాలై తేలిన సంగతి తెలిసిందే. దాసరి మనోహర్రెడ్డి సోదరి రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె సహస్ర (21)ల మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించి.. అనంతరం అంత్యక్రియలు జరిపారు. ప్రమాద ఘటనపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం ఘటనను పరిశీలిస్తే.. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక.. కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
సత్యనారాయణ రెడ్డి కుటుంబ నేపథ్యం..
దాసరి మనోహర్ రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి కరీంనగర్లో సాయి తిరుమల ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ ఆండ్ ఫెస్టిసైడ్స్ వ్యాపారం చేస్తున్నారు. మనోహర్ రెడ్డి సోదరి,సత్యనారాయణ రెడ్డి భార్య రాధ కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రైమరీ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. సత్యనారాయయణ-రాధ దంపతులకు ఒక కుమార్తె,కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడు శ్రీనివాస్రెడ్డి నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుమార్తె వినయశ్రీ ప్రస్తుతం నిజామాబాద్లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది.
హైదరాబాద్ వెళ్లొచ్చి.. మళ్లీ కుటుంబంతో బయలుదేరిన సత్యనారాయణ..
మరికొద్ది నెలల్లో మేఘన చదువు పూర్తికానున్న నేపథ్యంలో.. హైదరాబాద్లో ఆమెకు హౌజ్ సర్జన్గా శిక్షణ ఇప్పించాలని తండ్రి సత్యనారాయణ భావించారు. ఇందుకోసం ఇటీవల హైదరాబాద్ కొంపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కుమార్తె అవసరాల కోసం ఆ ఇంట్లో కొన్ని వస్తువులు కూడా కొనిపెట్టారు. అనంతరం తిరిగి కరీంనగర్ వచ్చిన సత్యనారాయణ.. మరుసటిరోజు కుమార్తె,భార్యను తీసుకుని బయలుదేరారు. సాయంత్రం 4గం. సమయంలో కరీంనగర్ బ్యాంకు కాలనీలోని ఇంటి నుంచి ఏపీ15బీఎన్ 3438 అనే నంబర్ గల కారులో బయలుదేరారు. అయితే కారులో వారు ఎక్కడికి బయలుదేరారన్నది మిస్టరీగా మారింది. బంధువులు అనుకుంటున్నట్టు టూర్కు బయలుదేరారా.. లేక హైదరాబాద్ బయలుదేరారా అన్నది తేలాల్సి ఉంది.
అలా బయలుదేరినవాళ్లు..
అలా బయలుదేరినవాళ్ల సమాచారం ఆ తర్వాత ఎవరికీ తెలియలేదు. బంధువులు,స్నేహితులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అనే వచ్చింది. దీంతో సన్నిహిత బంధువులు కొందరు వారి ఇంటికెళ్లి సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. ఫుటేజీలో వారు కారులో బయలుదేరినట్టు గుర్తించారు. అయినప్పటికీ... ఏదో అనుమానం రావడంతో.. ఇంటి తాళం పగలగొట్టి లోపలికెళ్లి చూశారు. అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో.. తిరిగి తాళం వేసి వెళ్లిపోయారు.
మనోహర్ రెడ్డికి తెలియడంతో..
వినయశ్రీ స్నేహితురాళ్లు కూడా ఆమెను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మొత్తం మీద దాదాపు 20 రోజుల తర్వాత ఆ సమాచారం మనోహర్ రెడ్డికి తెలిసింది. దాంతో చెల్లెలి కుటుంబం గురించి వెతకడం మొదలుపెట్టారు. పనిమనుషులను అడిగితే 15 రోజులు టూర్ వెళ్తున్నట్టు చెప్పారని తెలిపారు. దీంతో హైదరాబాద్లోని కొంపల్లి ఇంటికి వెళ్లి చూశారు. అక్కడికి కూడా రాలేదని తెలిసింది. ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ చేసి చూస్తే.. కరీంనగర్లోనే చూపించింది. అయితే తరుచూ విహార యాత్రలకు వెళ్లే అలవాటు ఉండటంతో.. వారు దుబాయ్ వెళ్లి ఉండవచ్చునని ఎమ్మెల్యే భావించవచ్చునని బంధువులు చెబుతున్నారు.
Recommended Video
ఇలా వెలుగుచూసింది..
పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తన అనే దంపతులు ఆదివారం రాత్రి కరీంనగర్ నుంచి గన్నేరువరం వెళ్తుండగా.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు అలుగునూరు కెనాల్లో పడిపోయారు. బైక్ లైట్ వెలుతురుకి భారీగా వచ్చిన పురుగులు ప్రదీప్ కళ్లల్లో పడటంతో.. ప్రమాదవశాత్తు బైక్ కాలువలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎల్ఎండీ పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి.. ప్రదీప్ను కాపాడారు. అప్పటికే కీర్తన గల్లంతయ్యారు. దీంతో కీర్తన కోసం గాలించేందుకు అధికారులతో మాట్లాడి కాలువకు నీటిని నిలిపివేశారు. దీంతో మానకొండూరు మండలం ముంజపల్లి వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. కాలువలో నీరు తగ్గుముఖం పట్టడంతో.. అందులోనే సత్యనారాయణ రెడ్డి కారు బయటపడింది. ఈ నెల 27న ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. వీలైనంత త్వరగా దీనిపై విచారణ పూర్తి చేస్తామని వారు చెబుతున్నారు.