కరోనా బారినపడ్డ మరో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ: హోంక్వారంటైన్లోకి జనార్ధన్, ఆస్పత్రిలో రాములు
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. సామాన్యులతోపాటు కరోనా బారినపడుతున్న ప్రముఖులు, ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడగా.. తాజాగా మరో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకింది.
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. గత రెండ్రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లో పరీక్ష చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోంక్వారంటైన్లోనే ఉంటున్నారు.
తాను ఆరోగ్యంగానే ఉన్నానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాక, గత వారం రోజులుగా తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు.
కరోనా బారినపడ్డ నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు
నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కూడా కరోనా బారినపడ్డారు. ఇటీవల ఎల్లూరు వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) పంపులు మునిగిన పరిస్థితిని పరిశీలించి వచ్చాక.. అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు నిర్వహించుకోగా ఎంపీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం 38,484 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 1421 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,29,001కి చేరింది.
కరోనా బారినపడి కొత్తగా ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారిసంఖ్య 1298కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది.
తాజాగా, 1221 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు 2,07,326 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,337 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. 17,214 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.