కెసిఆర్కు ఝలక్: కోటాపై ముత్తిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
జనగామ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రిజర్వేషన్లను కల్పిస్తూ వెళ్తుంటే పాలక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చెందిన ఎమ్మెల్యే వాటిని వ్యతిరేకిస్తున్నారు. రిజర్వేషన్లు తొలగించాలని తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగంలో వివిధ వర్గాలకు ల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తేనే రెడ్డి వర్గానికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో సంఘం జిల్లా శాఖ సమావేశంలో సోమవారం ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
పొడగించుకుంటూ పోతున్నాయి...
దేశంలో తొలుత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పదేళ్ల పాటు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారని, ప్రభుత్వాలు మాత్రం రిజర్వేషన్లను పొడిగించుకుంటూ పోతున్నాయని, దీంతో రెడ్డి వంటి అగ్రకులాల్లోని విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.
రిజర్వేషన్లు తొలగిస్తేనే మేలు..
రిజర్వేషన్లను తొలగిస్తేనే రెడ్డి కులస్థులకు ప్రయోజనం చేకూరుతుందని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల వల్ల రెడ్డి కులంలోని బిడ్డలు ఉన్నత విద్య, ఉద్యోగాలు పొందలేకపోతున్నారని, వారికి తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆయన అన్నారు.
అన్ని మార్కులు వచ్చినప్పటికీ...
రెడ్డి విద్యార్థులు ఆయా పరీక్షల్లో 90శాతం మార్కులు సాధించినా విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు రావడం లేదని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్లు ఉన్నందున ఇతరులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందుతున్నారని ఆయన అన్నారు.
రిజర్వేషన్లపై కెసిఆర్ ఇలా...
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కెసిఆర్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లును ఆమోదించి, దాన్ని కేంద్రానికి కూడా పంపింది. యాబై శాతానికి మించి కూడా కెసిఆర్ రిజర్వేషన్లను కల్పించడానికి సిద్ధపడుతుంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యే వాటికి వ్యతిరేకంగా మాట్లాడాడం చర్చనీయాంశంగా మారింది.