కెసిఆర్ క్లాస్: దిగొచ్చిన ముత్తిరెడ్డి, ఆయనకు సెల్యూట్
హైదరాబాద్: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జనగామ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దిగివచ్చారు. తాను రిజరేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు.
కెసిఆర్కు ఝలక్: కోటాపై ముత్తిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
క్షమించాలని కోరిన ముత్తిరెడ్డి
తన వ్యాఖ్యలను ఎవరైనా అపార్థం చేసుకుంటే క్షమించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఆయన వివరణ ఇచ్చారు.
తొలగించాలని అనలేదు..
రిజర్వేషన్లు తొలగించాలని తాను మాట్లాడలేదని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. ఏ కులం గురించి కూడా తాను మాట్లాడలేదని అన్నారు. మేధస్సు కలిగినవారు, ఆర్ధికంగా వెనుకబాటుకు గురైన వారికి రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుందని మాత్రమే అన్నట్లు తెలిపారు.
అలా రాశారు, నిజం కాదు..
పదేళ్ల పాటు రిజర్వేషన్లు ఇవ్వాల్సింది పోయి పెంచుకుంటూ వెళ్లారని తాను వ్యాఖ్యలు చెసినట్లు మీడియాలో రాశారని, తాను ఇలాంటి వాఖ్యలు చేయలేదని అన్నారు. దళితులకు భూములు ఇవ్వాలని చెప్తే అధికారులు అడ్డం పడ్డారని ఆయన అన్నారు. అందుకే అధికారులను తాను నిలదీసినట్లు తెలిపారు.
ఇలా అన్నారు..
ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ తన పిల్లలను రిజర్వేషన్ కోటాలో చదివించడం లేదని, ఆయనకు సెల్యూట్ చేస్తున్నానని ముత్తిరెడ్డి చెప్పారు. రిజర్వేషన్లను తొలగించాలని ఆయన అన్నట్లు వచ్చిన వార్తలతో తీవ్ర దుమారం చెలరేగింది.