ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణికి కరోనా పాజిటివ్... డ్రైవర్,వంట మనిషి,గన్మెన్కు కూడా..
కరోనా వైరస్ సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సతీమణి పద్మ లతా రెడ్డి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఆమెతో పాటు ముత్తిరెడ్డి గన్మెన్,డ్రైవర్,వంట మనిషికి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో వీరిని హోమ్ క్వారెంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు.
శుక్రవారం(జూన్ 12) ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్గా తేలడంతో.. ఆయన కుటుంబ సభ్యులు,గన్ మెన్,పనివాళ్లు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఆ రిపోర్టులు శనివారం(జూన్ 13)న రాగా.. మరో ముగ్గురికి పాజిటివ్గా తేలింది.
ప్రస్తుతం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉన్నారు. ముత్తిరెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన సతీమణి పద్మ లతా ఉదయం వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా ఒక ప్రకటన చేశారు. కార్యకర్తలు,అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు.
Recommended Video
కాగా, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విజృంభిసతస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతీరోజూ వందల్లో కేసులు,ఐదుకు తగ్గకుండా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ వాసుల్లో భయాందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో నగరంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ తప్పదన్న చర్చ కూడా మొదలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిపై మాట్లాడుతూ.. ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోందన్నారు. మరో 2,3 రోజుల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ,మాస్కులు ధరిస్తూ స్వీయ నియంత్రణలో ఉండాలని అధికారులు,నేతలు సూచిస్తున్నారు.