టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... నలుగురు కుటుంబ సభ్యులకూ... ప్రస్తుతం హోం క్వారెంటైన్లో
మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుకు కరోనా సోకింది. కోవిడ్ లక్షణాలు బయటపడటంతో శుక్రవారం(జులై 30) ఆయన టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో నలుగురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.వైద్యుల సూచనల మేరకు ఎమ్మెల్యే దివాకర్ రావు కుటుంబం ప్రస్తుతం హోం క్వారెంటైన్లో ఉన్నారు.
కరోనా సోకడంపై ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ... ఇటీవల దగ్గు,జ్వరంతో బాధపడుతుండటంతో టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్గా తేలడంతో హోం క్వారెంటైన్లోకి వెళ్లినట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు,సన్నిహితులు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
గత ఏడాదిన్నర కాలంలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారినపడి కొద్దిరోజుల్లోనే కోలుకున్నారు. మంత్రులు కేటీఆర్,హరీశ్ రావు,సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్,రేఖా నాయక్,పైలట్ రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు గతంలో కరోనా బారినపడి కోలుకున్నారు.
కరోనా కేసుల విషయానికి వస్తే... గురువారం(జులై 29) కొత్తగా 623 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,43,716కు చేరింది. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,796కి చేరింది. మరో 746 మంది కరోనా నుంచి కోలుకోవడంతో... ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,30,732కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,188 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.98 శాతంగా ఉంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల క్రితం వరకూ గాంధీలో రోజుకు 20 మంది కరోనా పేషెంట్లు అడ్మిట్ అవగా... ప్రస్తుతం 50 మంది వరకు అడ్మిట్ అవుతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 400 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.
కేసులు పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. ఈ నెల 3 నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించాలని భావించినప్పటికీ... ప్రస్తుత పరిస్థితుల్లో అది మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.