కేసీఆర్కు షాక్: సొంత పార్టీ ఎమ్మెల్యే రాజీనామా, అలా రాదని తలసాని ఫైర్
హైదరాబాద్: నారాయణపేట జిల్లా కోరుతూ అధికార తెరాస ఎమ్మెల్యే రాజీనామా చేశారని తెలుస్తోంది. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. జిల్లాల ఏర్పాటులో భాగంగా అన్ని వనరులు ఉన్న నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలని ఆయన మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
ఎప్పటి నుంచో జిల్లా ఏర్పాటును కోరుతూ ఆందోళనలు సాగుతున్నాయని, అన్ని వర్గాల ప్రజలు ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారని ఆయన చెబుతున్నారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు రావడంతో.. జిల్లా సాధన సమితి నేతలు మంగళవారం ఉద్యమం తీవ్రతరం చేశారు.
జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పేటలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా ప్రతిపాదనను ప్రభుత్వం విస్మరించడం సమంజసం కాదన్నారు. నారాయణపేటను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
నారాయణపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న సాధన సమితి సభ్యులను అరెస్టు చేయడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు.
దాదాపు అరగంటపాటు ఆందోళన కారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీస్ జులుం నశించాలంటూ ఆందోళనకారులు ర్యాలీగా స్థానికస్టేషన్కు చేరుకున్నారు. కాగా, రాజేందర్ రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచారు. ఆ తర్వాత తెరాసలో చేరారు.
రాజీనామాలపై తలసాని
రాజీనామాలతో జిల్లాల ఏర్పాటు జరగదని, ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లాల ఏర్పాటు పైన ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందని చెప్పారు.