ఎమ్మెల్సీ భూపతిరెడ్డి Vs ఎమ్మెల్యే బాజిరెడ్డి: భూప్రక్షాళన రికార్డులపై విచారణకు కలెక్టర్ ఆదేశం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లాలోని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య కొంత కాలంగా పొసగడం లేదు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మధ్య పొసగడం లేదు.ఈ తరుణంలో వీరిద్దరూ కేూడ కొంత కాలంగా ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకొంటున్నారు
గతంలో కూడ ఇదే రీతిలో వీరిద్దరూ ఒకరిపై మరోకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్న ఘటనలు కూడ చోటు చేసుకొన్నాయి. అయితే ఈ విషయమై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకూడదని కూడ ఆదేశించారు.
తాజాగా ఇదే తరహ ఘటన ఒకటి వెలుగుచూసింది. రైతుల భూ ప్రక్షాళన రికార్డులకు సంబంధించి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రైతుల నుండి డబ్బులను వసూలు చేశారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ విషయమై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టర్కు లేఖ రాశాడు. తన రాజకీయ ప్రతిష్టను ఎమ్మెల్సీ దిగజార్చారని ఎమ్మెల్సీ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణలు గుప్పించారు. తన 35 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తనపై ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలపై విచారణలో వాస్తవాలు తేలుతాయని ఆయన చెప్పారు. ఈ లేఖ ఆధారంగా విచారణ జరిపించాలని కలెక్టర్ డిఆర్వోకు ఆదేశాలు జారీ చేశారు. దోషులుగా తేలినవారిపై చర్యలు తీసుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేస్తున్నారు.