తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. రెండో దశలో ప్రజాప్రతినిధులు కూడా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. కాగా, సోమవారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో అందరు ప్రజాప్రతినిధుల కంటే ముందే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. జగిత్యాలలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపినీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా వేయించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఆస్పత్రి వైద్యులు పలు జాగ్రత్తలు సూచించారు. మొదట కరోనా వారియర్స్ ఉన్న వారికి టీకా వేసిన అనంతరం ప్రాధాన్యతా క్రమంలో అందరికీ టీకాలు వేస్తారని డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
కాగా, స్వయంగా వైద్యుడైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గతంలో కరోనా రోగులకు కూడా చికిత్స అందించి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రంలో బుధ, శనివారాలు మినహా రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
Recommended Video
సుమారు 5వేల ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో దేశ వ్యాప్తంగా ప్రధాని, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యంత్రులు సహా ప్రజాప్రతినిధులంతా వ్యాక్సిన్ వేసుకోనున్నారు.
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కొత్త కేసులు 300లోపే నమోదవుతున్నాయి. నిన్న 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 19,821 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,93,401కి చేరింది. ఇందులో 2,88,577 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో, 3234 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తాజాగా, కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1590కి చేరింది.