నయీం ఎన్కౌంటర్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం దందాలకు గత పాలకులే కారణమని టిఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి గురువారం ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించినందుకే నయీంను ఎన్కౌంటర్ చేశారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.
గతంలో నయీం తనను కూడా బెదిరించాడన్నారు. 2004 ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఫోన్లో బెదిరించారని తెలిపారు. కానీ తాను అతనికి భయపడకుండా పోటీ చేశానని చెప్పారు. ఈ విషయంపై అప్పుడే సిద్దిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
నయీంను చంద్రబాబు పెంచి పోషించారని ఆరోపించారు. నయీం సహకారం ఈ ప్రభుత్వానికి అవసరం లేదని చెప్పారు. నయీంను పెంచింది టిడిపితో పాటు కాంగ్రెస్ పెంచి పోషించిందన్నారు. నయీం ఎన్కౌంటర్ ప్రక్రియ సాధారణ ప్రక్రియలో భాగంగానే జరిగిందన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... ప్రభుత్వం రైతుల కోసం ప్రాజెక్టులను కట్టాలని చూస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. ప్రజలకు అవసరమయ్యే ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను కోరారు.
జీవో 123 ద్వారా భూ నిర్వాసితులకు సత్వరమే న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు మల్లన్నసాగర్లో అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఆలోచన లేకుండా మాట్లాడకూడదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు.