ఖబడ్దార్! దాడి చేస్తాం, పొలిమేర దాటలేరు: శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
మహబూబ్ నగర్: ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది అధికారులు అక్రమంగా సంపాదించుకున్నారని, ఆ సంపాదనతో బెంగుళూరు వంటి పలు ప్రాంతాల్లో ఫాంహౌస్లు కట్టుకున్నారని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో వారంతా దొంగల్లా జొరబడి కుట్రలు పన్నుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ధ్వజమెత్తారు.
కల్తీ మద్యం పేరుతో దాడులు నిర్వహించి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారన్నారు. కల్తీ కల్లు పేరుతో దాడులు చేస్తున్న మీరు గ్రామ పొలిమేరలు కూడా దాటలేరని, దాడులు చేస్తామని హెచ్చరించారు. మహబూబ్నగర్లో జరిగిన గౌడ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
డిస్టిల్లరీలు, లిక్కర్ మాఫియాతో అధికారులు కుమ్మక్కై గీత వృత్తిని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, పోస్ట్ మార్టం నివేదికల్లో ఎక్కడయినా కల్తీ కారణంగా చనిపోయినట్లు నివేదిక వచ్చిందా అన్నారు. గౌడ కులస్తులను ప్రభుత్వానికి దూరం చేసే కుట్రలు వద్దని హెచ్చరించారు.
అధికారులారా! ఖబర్దార్ అన్నారు. చీప్ లిక్కర్ను గీత కార్మికులు వ్యతిరేకించారంటూ కొంతమంది అధికారులు సీఎంకు తప్పుడు సమాచారం ఇచ్చారని, తమది ప్రజాప్రభుత్వం కాబట్టి, సీఎం కేసీఆరే స్వయంగా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారన్నారు.
తప్పుచేస్తే సీఎం కేసీఆర్ ఇంటి వద్దకు వెళ్లి కత్తితో పొడుచుకోనయినా చచ్చిపోతాను తప్ప, పుట్టిన గడ్డకు, జాతికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకురానని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మున్సిపల్ కమిషనర్గా పని చేసినప్పుడు సంతకం పెడితే కోట్లు వచ్చేవని, తెలంగాణ వస్తేనే తమ జాతికి న్యాయం జరుగుతుందని భావించి, ఉద్యోగాన్ని వదలిపెట్టుకుని ఉద్యమంలో పని చేశానన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమని, నాయకులను నిలదీస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. కుల వృత్తిని కాపాడుకొందాం.. ఆత్మగౌరవం చాటుకొందామన్న పిలుపుతో జరిగిన ఈ సభలో పాల్గొన్న కుల సంఘాల నేతలంతా.. శ్రీనివాస్ గౌడ్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు.