కెసిఆర్ నాయకత్వంలో ముందుకు: కాబోయే మంత్రులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ సాధించడంలో భాగస్వామి అయినందుకు తనకు సంతోషంగా ఉందని నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఆయన సిఎం కెసిఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
కెసిఆర్ ఏ శాఖ అప్పగించినా సమర్థవంతంగా పని చేస్తానని జూపల్లి అన్నారు. పారదర్శకంగా, అవినీతి రహితంగా పని చేస్తానని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని ప్రాజెక్టులను గతంలో సమర్థించినవారే ఇప్పుడు విమర్శిస్తున్నారని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని జూపల్లి అన్నారు.
ప్రజలు సంతోషంగా ఉన్నారు: లక్ష్మారెడ్డి
సిఎం కెసిఆర్ పాలనలో 90శాతం ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే తేడా లేదని చెప్పారు. సిఎం కెసిఆర్కు తెలంగాణలోని అన్ని జిల్లాలు సమానమేనని చెప్పారు. కెసిఆర్ అజెండాను అమలు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. జిల్లాలో పదవులున్న అందరం కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
చిల్లర రాజకీయాలు చేయను: తుమ్మల
తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్లనున్నట్లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మరో ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం జరిగే కేబినేట్ విస్తరణలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తానని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తాని చెప్పారు. ఖమ్మంలో టీఆర్ఎస్ను ఉన్నతస్థాయికి తీసుకొస్తానని అన్నారు. వ్యక్తిగత విమర్శలు, చిల్లర రాజకీయాలు చేసేవాడిని కాదని చెప్పారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు : తలసాని
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తలసాని మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మంత్రివర్గంలోకి సుకున్నందుకు సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సనత్నగర్ ప్రజల ఆప్యాయత మరిచిపోలేనిదని పేర్కొన్నారు. జంట నగరాల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేస్తానని ప్రకటించారు. జంటనగరాలను మరింత అభివృద్ధి చేస్తానని వ్యాఖ్యానించారు. సనత్నగర్ ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారని పేర్కొన్నారు.
దోస్తీ కారణంగానే పదవి: చందూలాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో తనకు మంచి స్నేహం ఉందని, అందువల్లే తనకు మంత్రివర్గంలో చోటు లభించిందని ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ చెప్పారు. కెసిఆర్తో కలిసి పని చేసిన అనుభవం తనకు అదనపు అర్హతగా ఆయన వివరించారు.
తెలంగాణ గిరిజనుల స్థితిగతులపై కెసిఆర్కు మంచి అవగాహన ఉందని ఆయన తెలిపారు. గిరిజనుడనైన తనకు మంత్రివర్గంలో చోట కల్పించినందుకు కెసిఆర్కు చందూలాల్ కృతజ్ఞతలు చెప్పారు. బంగారు తెలంగాణ సాధించే దిశగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా, తనకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి సిఎం కెసిఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.